సర్కారు స్కూళ్లలో ఏఐ | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్లలో ఏఐ

Mar 17 2025 2:58 AM | Updated on Mar 17 2025 11:28 AM

● పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో ఆరు పాఠశాలల ఎంపిక ● 331 మంది విద్యార్థులకు కృత్రిమ మేధ బోధన ● పిల్లల్లో పెరుగుతున్న ఆసక్తి..

పాల్వంచరూరల్‌ : ‘మారుతున్న కాలంలో విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలో ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. అయినా ప్రైవేట్‌ పాఠశాలల్లోనే ఎక్కువగా పిల్లలు చేరుతున్నారు. తల్లిదండ్రులకు సర్కారు స్కూళ్లపై నమ్మకం కలిగించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మెరుగు పర్చేందుకు ఆరిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఆరు పాఠశాలలను ఎంపిక చేసి 331 విద్యార్థులకు ఏఐ బోధన చేపట్టారు.

3, 4, 5 తరగతుల విద్యార్థులకు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రాథమిక స్థాయి విద్యార్థులు అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడిపోతున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా అశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో 3, 4, 5 తరగతుల వారిని మెరుగుపరిచేందుకు ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఆరు పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో సీ గ్రేడ్‌ విద్యార్థులు 331 మందిని గుర్తించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఏఐ బోధన చేపట్టారు. ఇందుకోసం ఆయా పాఠశాలలు లేదా పక్కన ఉన్న పాఠశాలల్లోని కంప్యూటర్లను వినియోగిస్తున్నారు.

ఆరు పాఠశాలలు.. 331 మంది విద్యార్థులు..

జిల్లాలో ఏఐ బోధన కోసం ఆరు పాఠశాలలను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు. వీటిలో భద్రాచలంలోని తాత గుడి ప్రాథమిక పాఠశాల, బూర్గంపాడు మండలం సారపాక, నాగినేనిప్రోలు, మోరంపల్లి బంజర, అంజనాపురం, బూర్గంపాడులోని ప్రాథమిక పాఠశాలలను గుర్తించారు. ఆయా పాఠశాలల పరిధిలోని 331 మంది విద్యార్థులకు ఏఐ ద్వారా బోధన చేయనున్నారు. ఎంపికై న పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను గ్రూప్‌గా ఏర్పాటుచేసి గణితం, తెలుగు వాచకాలపై 20 నుంచి 30 నిమిషాల పాటు ఏఐ విధానంలో బోధిస్తున్నారు.

పది స్థాయిల్లో బోధన

జిల్లాలోని ఆరు పాఠశాలలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఏఐ విధానంలో బోధిస్తున్నాం. కంప్యూటర్‌లో నేర్చుకోవడం అంటే పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు. పది స్థాయిల్లో వారికి పాఠాలు బోధిస్తున్నాం. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను గుర్తించి గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి నివేదిక తయారుచేస్తాం. జిల్లాలో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఇటీవలే ఏఐ బోధనను ప్రారంభించారు.

– నాగా రాజశేఖర్‌, జిల్లా అకడమిక్‌ కో ఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement