● కౌలు రైతులపై కనికరం చూపని ప్రభుత్వం ● పెట్టుబడి సాయంపై ఆశలు వదిలేసుకుంటున్న అన్నదాతలు ● ఎన్నికల హామీని పాలకులు విస్మరించారని ఆవేదన
బూర్గంపాడు: గత ప్రభుత్వ పాలనలో పెట్టుబడి సాయం అందక ఇబ్బందులు పడిన కౌలు రైతులకు ప్రస్తుత ప్రభుత్వం కూడా మొండిచేయి చూపుతోందని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా కౌలురైతులకూ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు. రైతు భరోసా నిధుల విడుదలలో ఎక్కడా కౌలు రైతుల ఊసెత్తడం లేదు. గత పది నెలల క్రితం మంత్రులతో సబ్ కమిటీ వేసిన ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించినా ఇప్పుడు పట్టనట్లు వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
55 వేల మంది.. 1.30లక్షల ఎకరాలు
జిల్లాలో సుమారు 55వేల మంది వరకు కౌలు రైతులు ఉండగా.. వీరు సుమారు 1.30లక్షల ఎకరాల్లో పట్టాదారుల నుంచి భూమి కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నారు. వీరికి గత ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు పథకం వర్తించలేదు. పంటలు సాగు చేసినా, చేయకున్నా పట్టాదారుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమయ్యేది. అలాగే బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే అవకాశం కూడా లేదు. కేవలం ప్రైవేట్ అప్పులతోనే కౌలు రైతులు పంటలు సాగు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినా వీరికి రూపాయి పరిహారం కూడా అందదు. పట్టాదారులు కనికరిస్తే తప్ప వారికి పంట నష్టపరిహారం కూడా అందే పరిస్థితులు లేవు. ఇక కౌలు రైతులు పండించిన పంటలను ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మాలంటే మళ్లీ పట్టాదారుల పేరుమీదనే అమ్మ డం.. ఆపై వారి ఖాతాల్లో నగదు అయితే తీసుకోవ డం పరిపాటిగా మారింది. మరోపక్క కౌలురైతులు సాగు చేసే పంటలకు ప్రభుత్వం అందించే పంటల బీమా కూడా వర్తించడం లేదు. ఈ పరిస్థితులను గుర్తించి కౌలురైతులకు కూడా పెట్టుబడి సాయమందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాన హామీ ఇచ్చినా ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
గుర్తించడమే సమస్య
కౌలు రైతుల గుర్తింపే ప్రభుత్వాలకు పెద్దసమస్యగా భావిస్తున్నారు. పట్టాదారులెవరూ తమకు వచ్చే రైతు భరోసాను వదులుకుని కౌలురైతులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండరు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలురైతు చట్టం ప్రకారం భూయజమాని, కౌలురైతులు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మాట్లో సంతకాలు చేసేవారు. నాడు బ్యాంకుల్లో కౌలు రైతుల పంటరుణాల కోసం ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం భూ యజమానులు తమకు ప్రభుత్వం నుంచి వచ్చే రైతుభరోసాను వదులుకుని కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో కౌలు రైతుల గుర్తింపు, వారికి రైతు భరోసా వర్తింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి.