● కూరగాయల నుంచి బంగారం వరకు ఇదే తంతు.. ● అడుగడుగునా మోసపోతున్న వినియోగదారులు ● అయినా తమకేమీ పట్టనట్లుగా అధికారుల తీరు
కొత్తగూడెంఅర్బన్: నిత్యం ఉపయోగించే ఉప్పు, పప్పు మొదలు ఫోన్లు, టీవీలు ఇలా ఏదైనా సరే డబ్బు చెల్లించి కొంటున్న వారంతా వినియోగదారులే. కానీ చాలా మంది నాణ్యత, ధరలు, ప్యాకింగ్లో తేడాతో మోసపోతున్నారు. వ్యాపారుల తీరుతో ఈ పరిస్థితి ఎదురవుతుండగా తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీల మాటే మరువడంతో మోసాల స్థాయి నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యాన నేడు(శనివారం) వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు షాపుల్లో శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యాన పరిశీలించగా నాణ్యతలో లోపాలే కాక కల్తీ జరుగుతున్నట్లు తేలింది.
మోసాలకు అడ్డుకట్ట ఏదీ?
కూరగాయల దుకాణాలతో పాటు కిరాణం షాపులు, సూపర్మార్కెట్లలో వినియోగదారులు నిత్యం మోసానికి గురవుతున్నట్లు తేలింది. చాలావరకుషాపుల్లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లకు బదులు తరాజులు, బాట్లు వాడుతున్నారు. వీటిని ఏటా తనిఖీ చేసి బరువు సరిగ్గా ఉందని నిర్ధారించి స్టాంప్ వేయించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అటు అధికారులు కూడా తనిఖీల మాటెత్తకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
జిల్లాలో కేసులు ఇలా...
జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు తూనికలు, కొలతల శాఖ అధికారులు 353 కేసులు నమోదు చేసి రూ.13 లక్షల జరిమానా విధించారు. అయితే, ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో, తమకు తోచినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాకాకుండా నిత్యం తనిఖీలు చేపడితే వ్యాపారుల తీరులో మార్పు రావడమే కాక వినియోగదారులకు నష్టం జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చు. కాగా, వినియోగదారులు మోసపోయామని భావిస్తే 98491 28458 నంబర్కు ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి సూచించారు.
తప్పనిసరిగా బిల్లులు
తీసుకోవాలి
డబ్బు చెల్లించే వారంతా వినియోగదారులుగానే భావించాలి. ప్రతీ వస్తువుకు బిల్లు తీసుకుంటే ఏ మాత్రం తేడా ఉన్నా వినియోగదారుల వివాదాల పరిష్కారం కమిషన్ను ఆశ్రయించవచ్చు. కానీ చాలామంది బిల్లులు తీసుకోకపోవడంతో నష్టపోయామని తెలిసినా పరిహారం అందే పరిస్థితి ఉండడం లేదు.
– జూలూరి రఘుమాచారి, కన్జూమర్స్,
ఇన్ఫర్మేషన్ రైట్స్ అవేర్నెస్ ఫోరం అధ్యక్షుడు