● భద్రగిరిలో సీతారాముల పెళ్లి పనులు ప్రారంభం ● పసుపు దంచడంతో పాటు తలంబ్రాల తయారీ ● వైభవోపేతంగా వసంతోత్సవం, డోలోత్సవం
భద్రాచలం: ఇంద్రధనస్సును తలపించేలా రంగులు.. వేలాదిగా హాజరైన భక్తజనం.. తలంబ్రాల తయారీతో మహిళల ఆనందోత్సవాలు... పాదయాత్రగా గోటి తలంబ్రాలు తీసుకొచ్చిన భక్తుల రామనామస్మరణతో భద్రగిరి సందడిగా మారింది. భద్రాచలంలో శ్రీరామనవమికి ముందు ఏటా నిర్వహించే తొలి వేడుక శుక్రవారం వైభవోపేతంగా సాగింది. ప్రతీ జంటకు ఆదర్శంగా నిలిచే కల్యాణ రాముడి పెళ్లి పనుల్లో భాగంగా మహిళలు సంప్రదాయబద్ధంగా పసుపు కొమ్ములు దంచే పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం వసంతోత్సవం, డోలోత్సవ సంబురాలతో దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం మురిసిపోయింది.
పసుపు కొమ్ములు దంచి.. తలంబ్రాలు కలిపి
ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములను దంచి తలంబ్రాల తయారీతో పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. రెండేళ్లుగా భక్తులను సైతం భాగస్వాములను చేస్తుండడంతో మిథిలా స్టేడియం, వైకుంఠ ద్వారం వద్ద ఈ ఏడాదీ కొనసాగించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తు ల కోలాటాల నడుమ పల్లకీసేవగా స్వామి ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారికి, రోళ్లు, రోకళ్లకు అర్చకులు, పండితులు పూజలు చేశారు. ఆపై ఆలయ ఈఓ రమాదేవి, అర్చకుల, పండితుల సతీమణులతో పసుపు కొమ్ములు దంచి పెళ్లి పనులను ప్రారంభించారు. ఆపై బియ్యంలో పసుపు, రోజ్వాటర్, గులామ్, సుగంధద్రవ్యాలను కలిపి తలంబ్రాలను సిద్ధం చేయడంతో పాటు తొలి తలంబ్రాలను ఆలయ అధికారులు తలపై ధరించి స్వామి వారి మూలమూర్తుల పాదాల చెంతన ఉంచారు.
వసంతోత్సవంతో శోభ
శ్రీ సీతారాములకు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించిన అర్చకులు తొలుత బేడా మండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులతో పాటు సువర్ణలక్ష్మి అమ్మవారికి పంచామృతంతో కలశాభిషేకం, సహస్రధారతో స్నపనం జరిపారు. ప్రత్యేకంగా అలకరించిన ఊయలపై శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను ఆశీనులు చేశారు. ఆస్థాన గాయకులు రామదాసు కీర్తనలను ఆలపిస్తుండగా అర్చకులు పూజలు చేశారు. అనంతరం స్వామికి నక్షత్ర హారతి సమర్పించడంతో పాటు వసంతాలను శ్రీ సీతారాములపై చల్లిన అర్చకులు వసంతోత్సవాన్ని ప్రారంభించారు. ఆపై భక్తులపైనా రంగులు చల్లడంతో బేడా మండపం రంగులమయంగా మారింది. ఇక సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
సప్తవర్ణాల రామయ్య!