● మిథిలా స్టేడియం వద్ద తలంబ్రాల తయారీకి ఏర్పాట్లు ● తీర్థబిందెతో వసంతోత్సవానికి అంకురార్పణ ● నేడు స్వామివారి నిత్యకల్యాణం రద్దు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. పెళ్లి పనులకు ఆదిమూలంగా భావించే పసుపు కొమ్ములను దంచి తలంబ్రాలు కలిపే వేడుకకు వైకుంఠ ద్వారం, మిథిలా స్టేడియం ప్రాంగణం సిద్ధమయ్యాయి. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకను అంగరంగవైభవోపేతంగా జరపడం ఆనవాయితీ. గత రెండేళ్లుగా భక్తులు సైతం పాల్గొనేలా మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఈ వేడుకను ఆలయ ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
తలంబ్రాల తయారీతో మొదలు..
వసంతోత్సవం రోజున భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను ప్రారంభించడం సంప్రదాయం. భక్తులు అత్యంత ఆధ్యాత్మికంగా భావించే ఈ కార్యక్రమాన్ని రెండేళ్లుగా మిథిలా స్టేడియం ప్రాంగణం, వైకుంఠద్వారం వద్ద నిర్వహిస్తున్నారు. పెళ్లి పనుల్లో భక్తులందరినీ భాగస్వాములు చేసేందుకు ఈ వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల తలంబ్రాలు కలిపేలా అధికారులు సన్నాహాలు చేస్తుండగా తొలి రోజు పసుపు, కుంకుమ దంచి, ప్రత్యేక గులాములతో 20 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయనున్నారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిత్యకల్యాణం రద్దు చేశామని, శనివారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
తీర్థ బిందెతో శ్రీకారం..
ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి రామాలయంలో శుక్రవారం జరగనున్న డోలోత్సవం, వసంతోత్సవానికి గురువారం అంకుకార్పణ చేశారు. మేళతాళాలు, అర్చకుల వేద మంత్రాల నడుమ పవిత్ర గోదావరి నదీ జలాలను తీసుకొచ్చి అంకురార్పణ చేశాక యాగశాలలో వాస్తుహోమం నిర్వహించారు.
నేడు వసంతోత్సవం, డోలోత్సవం..
బేడా మండపంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం జరపనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి సహస్రధారలతో స్నపనం, అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని ఊయలలో ఆశీనులు చేసి డోలోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృత స్నపనం, సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చన గావిస్తారు.
ముత్యాల తలంబ్రాలు ఎంతో ప్రత్యేకం..
భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం ఎంత ప్రత్యేకమో.. జానకిరాముల నుదిటి పైనుంచి జాలు వారే ముత్యాల తలంబ్రాలకూ అంతే ప్రత్యేకత ఉంటుంది. స్వామి, అమ్మవార్ల నుదుటి పైనుంచి జాలువారే తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆది దంపతులు, అన్యోన్యానికి ప్రతీకలైన సీతారాముల కల్యాణంలో ఉపయోగించే ఈ తలంబ్రాలను తమ ఇంట ఉంచుకోవడానికి భక్తులు తహతహలాడుతుంటారు. ఇక ఇళ్లలో జరిగే వివాహ వేడుక సందర్భంగా తయారుచేసే తలంబ్రాలలో ఈ ముత్యాలు కలిపిన స్వామి వారి తలంబ్రాలు కలిపితే దంపతుల నడుమ మరింత అనురాగం పెంపొందుతుందని, అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఉన్న శ్రీ సీతారాముల ఆశీస్సులు లభిస్తాయని పలువురు నమ్ముతుంటారు. అందుకే ఏటా భద్రాచలంలో దొరికే ముత్యాల తలంబ్రాలకు ఆదరణ పెరుగుతోంది. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారు భక్తిశ్రద్ధలతో గోటితో ఒడ్లను ఒలిచి తలంబ్రాలు తయారుచేసి రామయ్య కల్యాణానికి సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారు.