సూపర్బజార్(కొత్తగూడెం): జలసంచయ్ జన్ భగీదారి క్యాచ్ ది రైన్ అమలులో జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. హమాలీకాలనీలో జల సంచయ్ కార్యక్రమం అమలులో భాగంగా బుధవారం కలెక్టర్ స్వయంగా ఇంకుడు గుంతను తవ్వారు. స్థానిక యువకులతో మమేకపై నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణాల్లో అగ్రస్థానంలో ఉండాలని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి పెరుగుతుందని అన్నారు. భవిష్యత్లో నీటిఎద్దడి లేకుండా ప్రతి నీటి బొట్టు వృథా కాకుండా చూడాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, అధికారులు పాల్గొన్నారు.
ఉపాధి లక్ష్యాలను పూర్తి చేయాలి
చుంచుపల్లి: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనలతో కలిసి ఉపాధి హామీ పథకం అమలు, ఆస్తి పన్ను వసూలు, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై మండల స్థాయి, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూలీలకు వంద పని దినాలు కల్పించాలని, ఈ నెల 31 లోపు వందశాతం ఉపాధి పనులు పూర్తి చేయాలన్నారు. బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల జాబితా తయారు చేయాలని, వ్యవసాయ భూమిలో ఫారం పాండ్స్ ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని వివరించారు. యువతను భాగస్వామ్యం చేస్తూ అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టాలన్నారు. ఈ నెల 15 లోగా ఆస్తి పన్ను బకాయిల వసూళ్లు పూర్తి చేయాలన్నారు. బకాయిలు చెల్లించనివారి పేర్లు ఫ్లెక్సీల ద్వారా గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని, లేదా ఇంటిముందు డప్పులు వాయించాలని కలెక్టర్ తెలిపారు. ధరణి, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను, తాగునీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎల్–1 జాబితా శనివారంలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖ అధికారులు చంద్రమౌళి, శంకర్, వెంకటేశ్వరా చారి, బాబూరావు, శ్రీనివాసరావు, తిరుమలేష్, నళిని, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్