ఏదీ ఆహ్లాదం..? | - | Sakshi
Sakshi News home page

ఏదీ ఆహ్లాదం..?

Mar 13 2025 12:38 AM | Updated on Mar 13 2025 12:37 AM

● అస్తవ్యస్తంగా మారిన పట్టణ ప్రకృతి వనాలు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా పార్కులు ● వాకింగ్‌ ట్రాక్‌ల్లో వెలసిన పుట్టలు, పేరుకుపోయిన చెత్తాచెదారం ● కొరవడిన మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ

కొత్తగూడెంఅర్బన్‌: మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలు నిత్యం కాలుష్య సమస్యతో సతమతమవుతుంటారు. వాహనాల రద్దీ, వాటి నుంచే వచ్చే పొగ, పరిశ్రమల నుంచి వ్యర్థాలు, వాసనలతో కూడిన గాలి పీల్చుకుంటూ అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదం అందించేందుకు గత ప్రభుత్వం పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. కానీ నిర్వహణలోపంతో అవి ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. విషసర్పాల పుట్టలకు నిలయంగా మారాయి. విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన సిమెంట్‌ బల్లలు విరిగిపోయాయి. చెత్తాచెదారం పేరుకుపోయి కళావిహీనంగా తయారయ్యాయి. రాత్రి వేళల్లో కొందరు వనాల్లో మద్యం తాగుతున్నారు. మరోవైపు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది నిర్వహణను పట్టించుకోవడం లేదు. పట్టణాల్లో శానిటేషన్‌ పనులు చేసేందుకే సిబ్బంది సరిపోవడం లేదని, ఇక పట్టణ ప్రకృతి వనాల్లో పనులు ఎలా చేస్తారని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. రూ. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పట్టణ వనాలు నిరుపయోగంగా మారాయి. పుట్టలు పెరిగిపోయి వాటి నుంచి జనావాసాల్లోకి పాములు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముళ్ల పొదలతో..

పట్టణ ప్రకృతి వనాల్లో సేద తీరే పండ్ల చెట్లు, సుందరీకరణ మొక్కలు, నీడనిచ్చే చెట్లు, వేప, రావి, మర్రి కానుగ, బాదం వంటివి మొక్కలను పెంచారు. పూల, ఔషధ, ఉసిరి, నేరేడు, సీమచింత, కరివేపాకు, జామ వంటి మొక్కలు కూడా నాటారు. వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో నిర్వహణ బాధ్యత పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. కానీ రెండేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో పిచ్చిచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయాయి.

ఎండిపోతున్న మొక్కలు

జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రకృతి వనాలు ప్రజలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో మున్సిపాలిటీలో 10 నుంచి 20 వరకు పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 16, పాల్వంచలో 18, ఇల్లెందులో ఆరు, మణుగూరులో 8 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఇవన్నీ అధ్వానంగా మారాయి. నీరులేక మొక్కలు ఎండిపోతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు స్పందించి నిర్వహణ మెరుగు పరిచి ప్రజలకు ఆహ్లాదం పంచేలా పట్టణ ప్రకృతి వనాలను మార్చాలని పలువురు కోరుతున్నారు. పట్టణ ప్రకృతి వనాలపై కొత్తగూడెం మున్సిపాలిటీ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. స్పందించలేదు.

అధికారుల పర్యవేక్షణ కరువు

ఇల్లెందు: పట్టణంలోని కొత్తకాలనీలో ఆరు నెలల క్రితం రెండెకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన చిల్డ్రన్స్‌ పార్కు అస్తవ్యస్తంగా మారింది. రూ. 1.36 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో పార్క్‌ ఏర్పాటు చేశారు. ఆహ్లాదం కోసం గార్డెన్‌, జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, బల్లాలు తదితర సౌకర్యాలు కల్పించారు. సోలార్‌ లైటింగ్‌, నీటి కోసం బోర్లు, మోటార్లు అందుబాటులోకి తెచ్చారు. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడి పార్క్‌ చెత్తాచెదారంతో నిండిపోయింది. మున్సిపల్‌ పాలకవర్గ పదవీ కాలం రెండు నెలల క్రితం ముగిసింది. అప్పటి నుంచి అధికారుల్లో నిర్లిప్తత ఏర్పడింది. నీరులేక మొక్కలు ఎండిపోతున్నాయి. శానిటేషన్‌ లేకపోవటంతో చిన్నారులు ఆటపాటలకు వచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. మున్సిపల్‌ అధికారులు స్పందించి పార్కు నిర్వహణపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఏదీ ఆహ్లాదం..?1
1/2

ఏదీ ఆహ్లాదం..?

ఏదీ ఆహ్లాదం..?2
2/2

ఏదీ ఆహ్లాదం..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement