నరసరావుపేట రూరల్: మండలంలోని ములకలూరులో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామ శివారులోని వాగు పోరంబోకు భూముల్లో కొన్ని రోజులుగా ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. మూడు జేసీబీ మిషన్లను ఉపయోగించి మట్టిని తవ్వి పదుల సంఖ్యలో లారీలతో మట్టిని బయటకు తరలిస్తున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా సాగుతున్న అక్రమ తవ్యకాలపై గ్రామస్తులకు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేదు. కూటమి నాయకులు అక్రమ తవ్యకాలు నడిస్తుండటంతో అధికారులు అటువైపు చూసేందుకు జంకుతున్నారు. మట్టిని టిప్పర్ల ద్వారా నరసరావుపేటకు తరలించి విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్కు రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. పార్లమెంట్ ప్రజాప్రతినిధికి చెందిన కార్యాలయం నిర్మాణానికి మట్టి అవసరమని చెప్పి కూటమి నాయకులు ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. అక్రమ మట్టి తవ్యకాలను పరిశీలించేందుకు వెళ్లిన ఎంఐఎం నాయకులు, మీడియా ప్రతినిధులపై నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు.


