నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్షరాంధ్ర కార్యక్రమాలలో
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
బాపట్ల: అక్షరాంధ్ర కార్యక్రమాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పంచాయతీల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. అక్షరాంధ్ర, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీల అభివృద్ధి, డీఆర్డీఏ, సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీల అభివృద్ధిపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వయోజన విద్య ప్రతి రోజూ సమర్థంగా కొనసాగించాలని కలెక్టర్ చెప్పారు. ప్రతి రోజూ చదువు చెప్పడం, వర్క్ షీట్లు రాయడం, విద్యా బోధనపై వీడియోలు సెండ్ చేయడం విధిగా జరగాలని ఆదేశించారు. 381 సచివాలయాలలో జరిగే అక్షరాంధ్ర కార్యక్రమాలను తప్పనిసరిగా ఏపీఎంలు, ఎంపీడీవోలు తనిఖీలు చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. చీరాలలో సక్రమంగా జరగకపోవడం ఏమిటని నిలదీశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటా చెత్త సేకరణ పక్కాగా జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటి పన్నులు రూ.38.61 కోట్లు, నీటి పన్నులు రూ.6.03 కోట్లు వసూలు చేయాలని లక్ష్యాలు అధిగమించాలన్నారు.
జిల్లా టాప్–1లో ఉండాలి
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల్లో బాపట్ల జిల్లా టాప్–1లో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఆధార్ కార్డుల నవీకరణ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడానికి వంద రోజులు, 75 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచిగా చదవగలరన్నారు. డ్రాప్ అవుట్స్ అరికట్టాలని సూచించారు.
ఉపాధి పనులు వేగవంతం చేయాలి
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణాల పథకాల అమలుపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధి హామీ పథకం పనులను విరివిగా చేపట్టాలని ఆదేశించారు. నిరుపేద కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ఉపాధి పనులు మార్టూరు, వేటపాలెం మండలాలలో సక్రమంగా జరగకపోవడంపై అధికారులను నిలదీశారు. గృహ నిర్మాణాలలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు.


