భూ ఆక్రమణలపై సిబ్బంది దృష్టి సారించాలి
చీరాల ఆర్డీవో కె.చంద్రశేఖర్నాయుడు
ఇంకొల్లు(చినగంజాం): రెవెన్యూ సిబ్బంది భూ ఆక్రమణలపై దృష్టి సారించాలని చీరాల ఆర్డీవో కె. చంద్రశేఖర్ నాయుడు సూచించారు. ఇంకొల్లు మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమానికి హాజరైన ఆయన రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణలపై దృష్టి సారించాలని, దీర్ఘకాలంగా రూ.15 లక్షలు నీటి పన్ను బకాయిలు నిలిచిపోయాయని, వాటిని వెంటనే వసూలు చేయాలని, నీటి తీరువా వసూలు చేయాలని ఆదేశించారు. నీటి పన్నుకు సంబంధించి దేవదాయ శాఖ కూడా బకాయి ఉందని ఆ శాఖ అధికారులకు బాకీ విషయాన్ని తెలియజేసి పూర్తిస్థాయిలో నీటి పన్ను వసూలు చేసే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులు, చెరువులలో ఆక్రమణలను గుర్తించాలని, ప్రజావిజ్ఞుప్తులకు సంబంధించి పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


