తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో సోమవారం అవయవాల దానం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి, ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డాక్టర్ కె. రాంబాబులు మాట్లాడుతూ.. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన రాజులపాటి పాప (64) ప్రమాదానికి గురి అయిందన్నారు. ఆమె బంధువులు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారని పేర్కొన్నారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదని చెప్పారు. అనంతరం బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆమె అవయవాలను సేకరించి కాలేయాన్ని మణిపాల్లో ఒక రోగికి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారన్నారు. కార్నియాను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించామని వివరించారు. మంచి కార్యానికి ముందుకు వచ్చిన దాత కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తురకపాలెంలో
ఎన్సీడీసీ బృందం
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెం గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ప్రతినిధులు సోమవారం పర్యటించారు. గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎస్సీ కాలనీలో , విలేజ్ క్లినిక్ ప్రాంతాల్లో మట్టిని సేకరించారు. బెంగళూరుకు చెందిన బృందంతోపాటు గుంటూరు జిల్లాలోని ఎన్సీడీసీకి చెందిన 40 మందికి పైగా పాల్గొన్నారు. గ్రామంలో నీటి నమూనాలను కూడా సేకరించారు. మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం తీసుకెళుతున్నట్లు బృందం సభ్యులు తెలిపారు.
న్యాయవాద కోర్సుల
పరీక్షలు ప్రారంభం
పెదకాకాని: నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సోమవారం మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం) ద్వితీయ సెమి స్టర్, ఐదు సంవత్సరాల ఆనర్స్ బీబీఏఎల్ఎల్బీ, బీఏఎల్ఎల్బీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య ఎం.సుబ్బారావు తెలిపారు. ఎల్ఎల్ఎం పరీక్షలు ఏఎన్యూతోపాటు గుంటూరులోని జేసీ కాలేజ్ ఆఫ్ లా, ఏసీ కాలేజీ పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్నాయన్నారు. ఐదు సంవత్సరాల ఆనర్స్ పరీక్షలు విశ్వవిద్యాలయంలోని టీటీఎం విభాగంలో ప్రారంభం అయ్యాయన్నారు. పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక తనిఖీల బృందాలను నియమించినట్లు వివరించారు.
ఎంఎస్సీ కెమిస్ట్రీ
ఫలితాలు విడుదల
ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వరిధిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు రెండో సెమిస్టర్ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 507 మందికిగాను 357 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. వర్సిటీ అందిస్తున్న డిప్లమో ఇన్ ఫొటోగ్రఫీ కోర్సు రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేశారు. 15 మందికి గానూ అందరూ ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 23వ తేదీలోగా పేపరుకు రూ.1860 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
పులిచింతలకు 58,122 క్యూసెక్కులు విడుదల
రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఐదు క్రస్ట్గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 58,122 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఐదు క్రస్ట్గేట్లు రెండు మీటర్లు ఎత్తు ఎత్తి 49,720 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్పాదన అనంతరం 8,402 క్యూసెక్కులు మొత్తం 58,122 క్యూసెక్కులను దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
మహిళ అవయవాల దానం
మహిళ అవయవాల దానం