
ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
బాపట్ల: జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారుల దగ్గరకు సమస్యలను చెప్పుకోవడానికి వస్తారన్నారు. వాటిని సావధానంగా విని పరిష్కరించాలని ఆయన చెప్పారు. ప్రజల నుంచి రెవెన్యూ, పోలీస్, సర్వే శాఖలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిశీలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అర్జీలను గడువులోగా పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. సంతమాగులూరు మండలంలో అర్జీలు ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని, వాటిని పరిష్కరించ డానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
గ్రామాల్లో పర్యటన
ప్రజా సమస్యలను పరిశీలించడానికి తాను మారుమూల గ్రామాల్లో సైతం పర్యటిస్తానని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉన్న గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈకి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గైర్హాజర్ అయిన ఆర్ అండ్ బీ ఎస్ఈకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద ఏడు
సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి భూసేకరణ వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఈనెల 13వ తేదీ నుంచి 17 వరకు సీపీఆర్ వారోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలను ప్రాణాపాయ నుంచి రక్షించడానికి ప్రతి ఒక్కరూ సీపీఆర్ గురించి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా చీరాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీదేవి డెమోను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవిన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, కేఆర్సీ డెప్యూటీ కలెక్టర్ ఎస్.లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధా మాధవి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి పాల్గొన్నారు.