
మెరిట్ లేని డీఎస్సీ!
మెరిట్ కం రోస్టర్ జాబితా ప్రకటించకుండానే కాల్ లెటర్లు
అర్హులైన జాబితా ప్రకటించే ఆనవాయితీకి మంగళం పలికిన విద్యాశాఖ
గుంటూరులో ప్రారంభమైన డీఎస్సీ–2025 సర్టిఫికెట్ల పరిశీలన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన 19 టీమ్లు
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై తే దరఖాస్తులో ఇచ్చిన ఆప్షనే అంతిమం
పోస్టుల ఎంపికకు ఇప్పుడు అవకాశం లేక ఆందోళన చెందుతున్న అభ్యర్థులు
ప్రభుత్వ నిర్ణయం మేరకే పోస్టింగ్ అంటున్న జిల్లా స్థాయి అధికారులు
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఆధారంగా పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్, సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టులకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులను సాధించి, పోస్టు ఖాయం అనుకున్న అభ్యర్థులు సైతం విద్యాశాఖ విధించిన నిబంధనలతో అయోమయంలో పడ్డారు. పోస్టింగ్ వస్తుందా, లేదా అనే సందేహాలతో సతమతం అవుతున్నారు. కాల్ లెటర్ వస్తేనే ఉద్యోగం, లేకుంటే కొలువు గల్లంతే అనే విధంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది.
19 బృందాలతో పరిశీలన
ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ (ఏసీ) కళాశాలలో చేపట్టారు. మొత్తం 1,143 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 19 టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు కళాశాలలోని ఆడిటోరియంతోపాటు వేర్వేరు గదుల్లో 50 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థుల వారీగా డీఎస్సీ సైట్లో సర్టిఫికెట్లను విజయవంతంగా అప్లోడ్ చేసుకున్న వారినే వెరిఫికేషన్కు పిలిచారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ, పురుషోత్తం పర్యవేక్షణలో టీమ్ల వారీగా నియమించిన అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. పరిశీలకురాలిగా కమిషనరేట్ నుంచి పి.శైలజ హాజరు కాగా, డీఆర్వో ఖాజావలి వెరిఫికేషన్ సెంటర్ను తనిఖీ చేశారు.
కాల్ లెటర్ వస్తేనే...
విద్యాశాఖ నుంచి కాల్ లెటర్ పొందిన అభ్యర్థులకే పోస్టింగ్ అని, లేదంటే రాదనే కోణంలో నియామక ప్రక్రియ మారిపోయింది. పోస్టులకు మెరిట్ కం రోస్టర్ ప్రకారం జాబితాను బహిరంగంగా ప్రదర్శిస్తే అభ్యర్థులు సాధారణమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉండేది. కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. మరికొంత మంది తమకు కాల్ లెటర్లు రాకపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు వచ్చా రు. ప్రతి పోస్టుకు మెరిట్ ప్రకారం ఇద్దరేసి అభ్యర్థులను ఎంపికచేసిన అధికారులు వెరిఫికేషన్ సెంటర్కు వచ్చిన వారి సర్టిఫికెట్లను పరిశీలన జరిపారు. 930 మంది సర్టిఫికెట్ల పరిశీలన గురువారం రాత్రికి పూర్తిచేసేందుకు నిర్ణయించారు.