
కస్పా నిధులు కై ంకర్యం
యద్దనపూడి: దొంగలు.. దొంగలు కలసి ఊళ్లు పంచుకోవటం అంటే ఇదేనేమో. ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో నమో దు చేస్తూ లక్షలాది రూపాయల దేవస్థానం భూము ల ఆదాయాన్ని ఆ శాఖాధికారులు నొక్కేస్తున్నారు. కానీ ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు చెరువుని అభివృద్ధి చేయండి మహాప్రభో అంటూ మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా గతంలో ఎంతో అందంగా.. స్వచ్ఛమైన నీరు ఉండే చెరువు నేడు మురుగు, దుర్వాసనతో తాగునీటికే కాదు..వాడుకకి కూడా పనికి రాని దుస్థితికి చేరింది.
రికార్డులు మాయం
యద్దనపూడి మండలం పూనూరు గ్రామంలోని కస్పా చెరువు 40 ఎకరాల విస్తీర్ణంలో రెండు భాగాలుగా విస్తరించి ఉంటుంది. గ్రామంలోని 6,700 మందికి ఈ చెరువు నీరే ఆధారం. ఈ చెరువు దేవదాయ శాఖ ఆధీనంలో ఉంది. కాగా చెరువు మరమ్మతుల కోసం పూర్వం దాతలు ఇచ్చిన మాన్యం భూములు 20 ఎకరాలున్నాయి. ఈ 20 ఎకరాలపై సంవత్సరానికి రూ.4.80 లక్షల వరకు ఆదాయం వస్తుంది. 15ఏళ్లుగా భూముల ఆదాయ, వ్యయాలకు సంబంధించి అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం రికార్డులు సైతం మాయమవటం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఆ తరువాత నుంచి రికార్డులు అధికారుల దగ్గర ఉన్నప్పటికీ జమా, ఖర్చుల గురించి గ్రామస్తులు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడంలేదు. వేలంలో చెరువు మాన్యం భూములు కౌలుకు తీసుకున్న కొందరు రైతులతో ఎండోమెంట్ అధికారులు కుమ్మకై ్క పాడుకున్న మొత్తాన్ని వసూలు చేయకపోవటం ఒక ఎత్తైతే.. అరకొర జమ అయిన నగదును లేనిపోని ఖర్చులు చూపి సిబ్బంది మింగటం అలవాటుగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు అభివృద్ధికి 2022 సంవత్సరంలో రూ.50 వేలు మాత్రమే అధికారులు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇలా సంవత్సరానికి సరాసరి రూ.4లక్షలపైగా ఆదాయం వేసుకున్నా 15 సంవత్సరాలకు కలిపి రూ.60లక్షలు ఆదాయం ఏమైనట్లు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం లక్ష రూపాయలు మాత్రమే బ్యాంకు అకౌంట్లో ఉందని అధికారులు చెప్పటం గమనార్హం. గతంలోని ఓ అధికారి చెరువుకి లేని మెట్లు కూడా రిపేరు చేసి నట్లు, చెరువు చుట్టూ చెట్లు పీకి మట్టి తోలినట్లు, చెరువులోని నాచు, జమ్ము, తొగించకుండానే తొలగించినట్లు రికార్డుల్లో నమోదుచేసి లక్షలాది రూపాయలను డ్రా చేసి సస్పెండ్ కావడం గమనార్హం. చేయని పనులకు లక్షల్లో బిల్లులు చేసుకోవడం ఎండోమెంట్ అధికారులకు పరిపాటిగా మారింది.
కలుషితమవుతున్న నీరు
15 సంవత్సరాల కాలంలో ఎంతోమంది అధికారులు మారినా చెరువును అభివృద్ధి చేసే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం చెరువు చుట్టూ చిల్లచెట్లు మొలచి అధ్వానంగా మారింది. కట్టలపై వ్యర్థాలను పోయటంతో చెరువు చుట్టూ పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే చెరువు చుట్టూ కంచె లేకపోవటంతో పశువులు ఆ చెరువులోనే దిగుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఆ చెరువును బహిర్భూమికి వినియోగిస్తున్నారు. చెరువులో నాచు, జమ్ము, తూటాకు పెరగడంతో నీరు రంగు మారింది. ప్రస్తుతం ఆ నీటినే గ్రామస్తులు వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
కర్పూరంలా కరిగిపోతున్న కస్పా మాన్యం నిధులు చెరువు అభివృద్ధి చేయకుండానే రూ.60 లక్షలు స్వాహా సంబంధిత కార్యాలయాల్లో ఏళ్ల నాటి రికార్డులు మాయం పూనూరు గ్రూపు దేవస్థానం మాన్యం భూముల్లో అవినీతి