
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి
బాపట్ల: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను సమాజంలో పూర్తిగా నిర్మూలించినప్పుడే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమం గురువారం బాపట్లలో నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసులు, వివిధ శాఖల సమన్వయంతో బాపట్ల పట్టణంలో చేపట్టిన భారీ ర్యాలీని పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాలను వినియోగించరాదంటూ ర్యాలీలో పాల్గొన్న యువత ప్లకార్డులు చేతబూని పెద్ద పెట్టున నినదించారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం కూడలిలో మానవహారం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ఎంపీ మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు చిన్నారులు, యువతనే లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ బాపట్లను నషా ముక్త్ జిల్లాగా నిలపడానికి అందరూ కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాలు తయారీ, వినియోగం, రవాణా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఏడాది 80 శాతం మేర గంజాయి కేసులు తగ్గాయన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు జిల్లాలో ఈగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బుడా చైర్మన్ సలగాల రాజశేఖర్బాబు పాల్గొన్నారు.
ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్లలో భారీ ర్యాలీ