
మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్చండి
బల్లికురవ: దూరంలో ఉన్న పాఠశాలలకు తమ బిడ్డలను పంపలేమని తమ పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలని చిన అంబడిపూడి, కొణిదెన హెచ్సీ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు.. గురువులను డీఈఓ, డిప్యూటీ ఈవోలకు గురువారం విన్నవించారు. ఇటీవల ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను బేసిక్, ఫౌండేషన్, మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్పుచేసింది. రెండు పాఠశాలల్లో ఫౌండేషన్తో 1,2 తరగతులను నిర్వహిస్తూ, 3,4,5 తరగతులను మరో పాఠశాలలకు విలీనం చేశారు. చిన అంబడిపూడి పాఠశాలను పెద అంబడిపూడి హెచ్సీ పాఠశాలకు, కొణిదెన హెచ్సీ పాఠశాలను హెచ్ఈ పాఠశాలలో కలపటంతో గ్రానైట్ లారీలు రాకపోకలు, ట్రాఫిక్ దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు వివరించారు. ఇటీవల మోడల్ పాఠశాలలుగా మార్చాలని కలెక్టర్ జె.వెంకట మురళి, డీఈవో ఎస్ ఎస్ పురుషోత్తం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు వినతి పత్రాలు అందజేశారు. డీఈవో రెండు పాఠశాలల తనిఖీ, విలీనం అయిన పాఠశాలలను పరిశీలించి ఎంఈవో 1, 2 వస్త్రం నాయక్, రమేష్బాబు, కాంప్లెక్స్ చైర్మన్లు జె.హనుమంతరావు, కేబీ వెంకటేశ్వరరావుతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు రెండు పాఠశాలలను, రికార్డులు తనిఖీ చేశారు. 1 నుంచి 5 తరగతుల్లో ఆధార్ డేటా ప్రకారం 45 పైగా విద్యార్థులు ఉండాలని అప్పుడే మోడల్ పాఠశాలగా మార్పు చేసేందుకు నివేదిస్తామని ప్రకటించారు.