
మత్తు పదార్థాలతో ఎన్నో అనర్థాలు
రేపల్లె: మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని సీడీపీవో ఎం.సుచిత్ర చెప్పారు. మండలంలోని బేతపూడి ప్రాథమిక పాఠశాలలో బుధవారం నిర్వహించిన నిషా ముక్త భారత్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలైతే బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. మత్తు పదార్థాలతో నష్టాలను తెలుసుకుని తల్లిదండ్రులకు, తోటి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్ఎం సునీల్ భాస్కర్, సూపర్వైజర్ హిమబిందు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, కృష్ణారావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మిర్చి రైతులను గాలికొదిలిన చంద్రబాబు
పిడుగురాళ్ల: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత చెప్పేది కొండంత అనే చందగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై అశ్రద్ధ వహిస్తుందన్నారు. మిర్చి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా సుమారు రూ.25,000 పలికిన మిర్చి ధర కూటమి ప్రభుత్వంలో రూ.6వేలకు పడిపోయిందన్నారు. ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు కనీస మద్దతు ధర రూ.11,700 ఉండబోతుందంటూ ఆర్భాటపు ప్రకటన చేశారన్నారు.