బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం | - | Sakshi
Sakshi News home page

బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం

Jun 25 2025 7:22 AM | Updated on Jun 25 2025 7:22 AM

బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం

బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

బాపట్ల: బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులకు ఆదేశించారు. బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీడీవోలు మండల స్థాయి అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బ్లాక్‌ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సీఎం యాప్‌లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో మూడు కేంద్రాలలో బ్లాక్‌ బర్లీ కొనుగోలు కొనసాగుతుందని, వీటిని ఎనిమిది కేంద్రాలకు విస్తరించాలని అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌ మార్క్‌ఫెడ్‌ ఏడీని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు ప్రతిపాదన తయారు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం యాప్‌లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరుకు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్‌ అయ్యారని, వీరి కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్‌ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 13 వేల మంది పొగాకు రైతులు ఉన్నారని, సీఎం యాప్‌లో 7, 270 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. యాప్‌లో నమోదైన రైతులకు తేదీలు కేటాయించినట్లు తెలిపారు. ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు 97 మందికి కొనుగోలుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. రైతులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పొగాకు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఒకవేళ వారు వారికి కేటాయించిన తేదీల్లో తీసుకురాని వారికి మాన్యువల్‌గా కొనుగోలుకు అవకాశం కల్పించాలని మార్క్‌ఫెడ్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్క్‌ఫెడ్‌ ఏడీ కరుణశ్రీ, ఉప కలెక్టర్‌ లవన్న, జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారి శ్యాంసన్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవాదాయశాఖ భూములను పరిరక్షించాలి

ఆక్రమణకు గురైన దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆక్రమణకు గురైన దేవాదాయ ధర్మాదాయశాఖ భూములపై సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వేలో బాపట్ల పట్టణంలోని భావన్నారాయణస్వామి ఆలయానికి చెందిన 6 ఎకరాల 62 సెంట్లు, శ్రీ ఈస్ట్రన్‌ చౌల్ట్రీకి సంబంధించి 28 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందని తెలిపారు. పర్చూరు మండలంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన 4 ఎకరాల 71 సెంట్లు, చీరాల మండలంలో శ్రీ మదనగోపాలస్వామి ఆలయానికి సంబంధించి 5 ఎకరాల 36 సెంట్లు, భట్టిప్రోలు మండలంలో శ్రీ విఠలేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 97 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. ఆక్రమించిన స్థలంలో పక్కా గృహాల నిర్మాణం జరిగిందని దేవాదాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. స్థలాలను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న వారిని పిలిపించి కార్డు ధర మేరకు లేక లీజుకు తీసుకొని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కొల్లూరు మండలంలో శ్రీ సోమశేఖర్‌స్వామి దేవస్థానం సంబంధించి 222 ఎకరాల 89 సెంట్లు, భట్టిప్రోలులో శ్రీ నరేంద్రస్వామి దేవస్థానానికి చెందిన 62 ఎకరాల 31 సెంట్లు, భట్టిప్రోలులో శ్రీ వరదరాజస్వామి దేవస్థానానికి చెందిన 81 ఎకరాల 42 సెంట్లు ఆక్రమణకు గురయ్యాయని, స్థలంలో రైతులు సాగు చేసుకుంటున్నారని దేవాదాయ శాఖ అధికారులు వివరించారు. ఆర్‌ఓఆర్‌ కింద కేసు నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి సూర్య ప్రకాష్‌రావు, డీపీఓ ప్రభాకర్‌, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, పురపాలక సంఘ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement