
బర్లీ కొనుగోలులో జాప్యం తగదు
జిల్లా రైతు సంఘం నాయకులు
పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకును రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తే తగదని.. మరింత వేగవంతం చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు మంగళవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి రోజుకు 200 బేళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఇదే విధంగా కొనుగోలు సాగితే రైతుల వద్ద ఉన్న పంట అంతా అమ్ముడుపోయేందుకు ఆరు, ఏడు నెలలు పైగానే సమయం పడుతుందన్నారు. జాప్యం చేయకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. రోజుకు కనీసం 1000 బేళ్లు చొప్పున పాగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నిర్ణయించిన హై గ్రేడు ధర రూ.12 వేలు, లోగ్రేడ్ ధర రూ.6 వేలు చొప్పున ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారన్నారు. మధ్య గ్రేడు పొగాకు ధర క్వింటా రూ.9 వేలు నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బండి శంకరయ్య మాట్లాడుతూ పొగాకు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పొగాకు కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కే శ్రీనివాసరావు, ఎం డేవిడ్, ఎర్రం శ్రీనివాసరెడ్డి, వీ పుల్లారెడ్డి, కే నాగురు తదితరులు పాల్గొన్నారు.