
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటించే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ఆ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యానగర్, రింగ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు. నగరపాలక సంస్థ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎటువంటి సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణ మూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్లతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.