
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు
చినగంజాం: రైతులు రాబోయే సీజన్లో పొగాకుకు ప్రత్యామ్నాయంగా వివిధ పంటలు సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు రత్నకుమారి సూచించారు. మండలంలోని చింతగుంపల, కడవకుదురు గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి ఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రత్నకుమారి మాట్లాడుతూ.. మండలంలో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో రైతుల నమోదు ప్రక్రియ జరుగుతోందన్నారు. ముందస్తుగా మార్క్ఫెడ్ నుంచి షెడ్యూల్ ఇస్తామని, ఆ షెడ్యూల్ ప్రకారం పొగాకు కొనుగోలు కేంద్రాలకు ఉత్పత్తులను తీసుకెళ్లాలన్నారు. అనంతరం వేరుశనగ పైరును పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసుకోవాల్సిందిగా సూచించారు. కౌలు రైతు కార్డులు పంపిణీ చేస్తున్నామని, అర్హులైన వారు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో వీఏఏలు సంధ్య, కిషోర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యం
బాపట్ల: గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమన్వయంతో యంత్రాంగం పని చేయాలని బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్.ప్రభాకరరావు చెప్పారు. మంగళవారం స్థానిక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2025 గురించి జరిగిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో డీపీఓ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తడి, పొడి వ్యర్థాల నిర్వహణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు తీరు పరిశీలన నిమిత్తం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం వస్తోందని తెలిపారు. స్వచ్ఛతపై వివిధ అంశాలను చూసి మార్కులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి గ్రామాలకు మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. గ్రామీణ మంచినీటి సరఫరా జిల్లా ఎస్ఈ అనంతరాజు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం వంటి వాటిలో ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. డీడీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, డెప్యూటీ ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, ఎంఆర్సీలు, పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి
పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు

ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు