
గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం
ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి
నిజాంపట్నం: గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. మండలంలోని కళ్లిఫలం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుందన్నారు. గీత కార్మికుల ఉత్పత్తులను గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్నారు. తాటి కల్లు నుంచి తాటి బెల్లం తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది సుభాషిణి, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఖతార్లో ఉద్యోగాలకు అవకాశం
క్రోసూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఖతార్ దేశంలో వెల్డర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి తమ్మాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 24 నుంచి 45 సంవత్సరాలు, పురుషులు ఐటీఐ లేదా ఐటీసీ, పూర్తి చేసి 4 సంవత్సరాలు అనుభవం ఉండాలని చెప్పారు. నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 25 వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. http// nai punyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 సంప్రదించాలని కోరారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
నూజెండ్ల: నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఐనవోలు ఎస్సై బీవీ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు అందజేస్తామన్నారు.