
వైఎస్సార్ మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలి
పిడుగురాళ్ల: డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పల్నాడు హాస్పిటల్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు. పల్నాడు ప్రజలకు హెల్త్ కేర్ యాక్సెస్ ప్రతి ఒక్కరికి అందుతుందని చెప్పారు. వైద్య విద్య, ఉపాధి, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రమాదాలు చోటుచేసుకున్నా గుంటూరు వరకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించి గతప్రభుత్వంలో 30 శాతం మాత్రమే పూర్తిందనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకురాకపోతే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలసి ప్రత్యక్ష పోరాటానికి దిగితామని ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు.
డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్