
మోసకారి బాబుపై యువత పోరు
● ఉద్యోగాల పేరిట చంద్రబాబు మోసం ● ఏడాదిగా నిరుద్యోగ భృతికి ఎగనామం ● ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ● గద్దెనెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వని వైనం ● జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ● కూటమి సర్కారు తీరుతో ఆందోళనలో యువత ● వైఎస్ జగన్ పాలనలో పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ● కూటమి పాలకుల తీరును నిరసిస్తూ నేడు ‘యువత పోరు’
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల సమయంలో చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తు బాధ్యత తనదేఅంటూ అడ్డగోలుగా హామీలు కురిపించారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలన్నారు. అది ఆలస్యమయితే ఇచ్చేవరకూ నెలకు రూ. 3 వేల వంతున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కలలకు రెక్కల పథకం ద్వారా రుణాలు అన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. కాలేజీలకే రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్ చిక్కులు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. జీవో 117 రద్దు చేస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీవిద్య పథకం పునరుద్ధరణ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. గద్దెనెక్కగానే మెగా డీఎస్సీ అన్నారు. ఇంకా ఏవేవో చెప్పారు. కూటమి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని విద్యార్థులు, నిరుద్యోగులు గంపెడాశతో ఎన్నికల్లో కూటమికి ఓట్లేశారు.
సీఎం కాగానే తీరులో మార్పు
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఆర్భాటంగా సంతకం చేశారు. ఇక ఉద్యోగాల కల్పన అంటూ ప్రకటనలతో హోరెత్తించారు. డీఎస్సీ నోటిఫికేషన్ రావడానికే ఏడాది పట్టింది. మెగాకు బదులు నామమాత్రంగా పోస్టులు ప్రకటించారు. ఇక మిగిలిన తంతు పూర్తయ్యేసరికి ఇంకెంతకాలం పడుతుందో తెలియదు. మిగిలిన అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ ఖాళీల భర్తీ అని చెప్పినా ఎప్పటికి ఆ ప్రక్రియ మొదలువుతుందో అంతుచిక్కని పరిస్థితి. ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆయన గద్దెనెక్కి ఇప్పటికే ఏడాది అయినా ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. 2014లోనూ చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక యువతను ముంచేశారు.
20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు?
కూటమి పాలనలో ఉద్యోగాలు లభిస్తాయని, లేకుంటే నిరుద్యోగ భృతి వస్తుందని యువత ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే చదువుకోసం, ఇతర నైపుణ్య శిక్షణల కోసం రూ.లక్షల్లో వెచ్చించి వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.
ఇంటికొక నిరుద్యోగి....
జిల్లాలో 459 గ్రామపంచాయతీల పరిధిలో 944 గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలో 4,97,000 గృహాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇంటికొకరు అనుకున్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఉద్యోగాలతోపాటు తక్షణ సాయంగా నిరుద్యోగ భృతిని ఆశిస్తున్నారు. ఇంటికొకరికి నిరుద్యోగ భృతి అనుకుంటే నెలకు రూ.149.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఏడాది అయినందున ఈ మేరకు యువతకు చంద్రబాబు సర్కారు బాకీ పడినట్టైంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని యువత డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా...
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చదువుకున్న యువతకు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించింది. జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 5,247 ఉద్యోగాలు ఇచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో వేలాది మందికి వలంటీర్ ఉద్యోగాలు వచ్చాయి. 348 హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి 348 ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి, వారి శ్రమను గుర్తించింది. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారా జిల్లాలో 705 యూనిట్లు ఏర్పాటు చేసింది. వారికి రూ. 110.69 కోట్ల మేర రాయితీలు కల్పించింది.
యువతకు ఉద్యోగాలిస్తామని, లేదంటే భృతి ఇస్తామని మోసం
యువత ఆశలను కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో దారుణంగా విఫలమైంది. ఓట్ల కోసం కూటమి నేతలు నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని పేర్కొన్నారు. తీరా అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలను తుంగలో తొక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునందుకొని సర్కార్ వంచనను నిరసిస్తూ యువత పోరు పేరుతో పార్టీ శ్రేణులు సోమవారం ఆందోళన చేపట్టనున్నాయి. బాపట్ల పట్టణం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తారు. బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నాయి.