
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీలను సమ ర్పించవచ్చని పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో కూడా అర్జీలు నమోదు చేయవచ్చని తెలిపారు. అర్జీల స్థితికి సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబరుకు కాల్ చేయవచ్చని వివరించారు.
నేడు దుర్గగుడి
మాస్టర్ప్లాన్పై సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహామండపంలోని ఏడో అంతస్తులో సమీక్ష జరగనుంది. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్ప్లాన్ అమలుపై దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులకు ఆలయ ఈవో శీనానాయక్ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ దుకాణాలను తరలిస్తేనే అభివృద్ధి పనులకు అటంకం లేకుండా సకాలంలో పూర్తి చేసే వీలుందని ఆలయఅధికారులు భావిస్తున్నారు.