
భర్తపై భార్య కత్తితో దాడి
నరసరావుపేటటౌన్: భర్తపై కత్తితో దాడికి పాల్పడిన భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ ఎం.విజయ్ చరణ్ శనివారం తెలిపారు. షాలెంనగర్కు చెందిన జంపాని అజయ్ కుమార్కు రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన ధనూషలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ధనూష ఇటీవల పుట్టింటికి వెళ్లింది. భర్త ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరగా, శనివారం షాలెంనగర్కు వచ్చింది. మళ్లీ భార్యా, భర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అజయ్ కుమార్పై ధనూష దాడికి పాల్పడింది. స్థానికులు క్షతగాత్రుడిని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సు
ఢీకొని మహిళ మృతి
పట్నంబజారు: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరగుంట సమీపంలోని స్కైలోన్ అపార్ట్మెంట్లో నివసించే నరహరి శైలజ (54) భర్త శ్రీనివాసరావుకు మార్కెట్లో కిరాణా దుకాణం ఉంది. ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం జిన్నాటవర్ సెంటర్లోని ఒక దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసేందుకు శైలజ వచ్చారు. అక్కడ కొనుగోలు చేసి కిందకు దిగారు. అప్పుడే గుంటూరు– 1 డిపో నుంచి క్రోసూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆపబోయాడు. ఈ క్రమంలో శైలజ బస్సు ముందు నుంచి నడిచి వెళ్తుండగా, గమనించని డ్రైవర్ ముందుకు నడిపాడు. బస్సు టైర్ కింద పడి శైలజ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు.
ప్రత్యామ్నాయ పంటలను సూచించండి
యడ్లపాడు: ఈ ఏడాది పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలో ప్రభుత్వం రైతులకు సూచించాలని, అదేవిధంగా ఆయా పంటలకు గిట్టుబాటు ధర సైతం కల్పిస్తామనే గ్యారెంటీని రైతులకు ఇవ్వాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. యడ్లపాడు మండలం మైదవోలు – వంకాయలపాడు పరిధిలోని స్పైసెస్ పార్కులోని జిల్లా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాణ్యత సాకులు చూపకుండా, షరతులంటూ ఇబ్బందులు పెట్టకుండా రైతుల పొలాల్లోని నిల్వలన్నింటినీ పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు.