
23 నుంచి ఫ్లైఓవర్ పనులు ప్రారంభం
గుంటూరు వెస్ట్: శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు ఈ నెల 23 నుంచి ప్రారంభవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా ఏసీ కాలేజీ వైపు నుంచి పనులు ప్రారంభించాలని, దీనికి సంబంధించి సోమవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని ఆదేశించారు. వాహనాల మళ్లింపు గురించి ట్రాఫిక్ పోలీసులు పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆమె చెప్పారు. వాహనదారులకు వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. డొంక రోడ్డులోని మూడు వంతెనల వద్ద రోడ్డు లెవెలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ పి.విశ్వనాథరెడ్డి, జీఎంసీ ఎస్ఈ కె.నాగేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ పాల్గొన్నారు.