
రెవెన్యూ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: భూమి దస్త్రాలతోనే రెవెన్యూ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. రెవెన్యూ దినోత్సవం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అవార్డులు, జ్ఞాపికలతో సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విజ్ఞానం పెంచుకుంటేనే రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు విశేష సేవలు అందించగలమని అన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటికీ మాతృ శాఖగా రెవెన్యూ నిలుస్తోందన్నారు. ప్రత్యేక గుర్తింపు ఉన్న రెవెన్యూ శాఖ పుట్టిన రోజును ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడానికి అనుమతులు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తే ఎంతో విలువ, హోదా లభిస్తుందన్నారు. విపత్తు సమయాలలో రెవెన్యూ శాఖ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివన్నారు. అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేసేది రెవెన్యూ శాఖ ఒకటేనన్నారు. రెవెన్యూశాఖలో అన్ని హోదాలలో శిక్షణ పొందిన తరువాతనే ఐఏఎస్లుగా నియమితులవుతారన్నారు. రెవెన్యూ శాఖలోకి వచ్చిన ప్రతి ఉద్యోగి చట్టాలు, జీవోలపై అవగాహన పొందితేనే ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. ప్రజలకు విశేష సేవలందించే భాగ్యం రెవెన్యూశాఖ ద్వారానే ఏర్పడుతుందన్నారు. నూతనంగా రెవెన్యూ లోకి వచ్చే ఉద్యోగులకు చట్టాలపై కనీసం అవగాహన ఉండటం లేదన్నారు. విధి నిర్వహణలో మరింత ప్రావీణ్యం పొందాలన్నారు. ఈనెలఖారకు ఉద్యోగ విరమణ చేయనున్న ముగ్గురు తహసీల్దార్లు సీతారత్నం, త్రిపుర బాల సుందరమ్మ, వెంకటరత్నంలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్ మాట్లాడుతూ జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే ప్రత్యేక అధికారాలున్న రెవెన్యూశాఖ మాతృశాఖగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. విపత్తులు, ఎన్నికల నిర్వహణ సమయంలో రెవెన్యూ శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రెవెన్యూ శాఖకు ఉన్న విస్తృతమైన అధికారాలను వివరించారు. బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలందించే ప్రత్యేక హోదా రెవెన్యూ శాఖకు ఉందని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయడంలోనూ ప్రథమంగా నిలుస్తుందన్నారు. కేఆర్ఆర్సీ ఉపకలెక్టర్ లవన్న మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కనకరాజు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.