
దేవస్థాన భూముల్లో మట్టి తవ్వకాలు
నగరం: నగరం మండలం శిరిపూడి గ్రామంలో దేవస్థాన భూములలో టీడీపీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. మట్టి అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. శిరిపూడి గ్రామదేవత శిరిపూడిమ్మ తల్లి దేవస్థానానికి 20 ఎకరాల భూమి ఉంది. సుమారు ఆరు ఎకరాలలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాలుగు రోజులుగా మట్టిని తవ్వి తరలిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 1500 ట్రాక్టర్ల మట్టిని తరలించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ రూ.1500లకు అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. పట్టపగలే యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్నారు. ఽస్థానిక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అండదండలతోనే శిరిపూడిలోని దేవస్థాన భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మంత్రి, అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
శిరిపూడిలో పచ్చనేతల దందా అక్రమార్కులపై చర్యలు తీసుకొవాలంటున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు
మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుంటాం
శిరిపూడి దేవస్థాన భూములలో మట్టిని తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చింది. అక్రమంగా మట్టి తరలింపుపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం.
–రాజేశ్వరరావు, ఈఓ