
చీరాలలో ఆగని ఇసుక దందా
చీరాల టౌన్: ప్రకృతి సంపద అయిన ఇసుకను అప్పనంగా ఆరగిస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు కూటమి నేతలు. 24 గంటలు ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు, టైరు బండ్లలో ఇసుకను రవాణా చేస్తున్నా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ‘‘ఇసుక ఎవరూ రవాణా చేయకూడదు.. మేము నిరంతరం నిఘా పెట్టాం.. అక్రమార్కులు ఎవరైనా వదలి పెట్టం’’ అంటూ జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి నిత్యం హెచ్చరిస్తుంటారు. కానీ చీరాల నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. చీరాల మండలంలోని సముద్ర తీర ప్రాంతంతోపాటు ఈపూరుపాలెం, విజయనగర్కాలనీ, సావరపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, పాతచీరాల, 216 జాతీయ రహదారి తదితర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలను పొక్లెయిన్లతో తవ్వుకోవడంతో ఆ స్థలాలు చెరువుల్లా మారాయి. ఈపురుపాలెంలో కూటమి నాయకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమాలు సాగుతున్నాయి. బోయినవారిపాలెం రోడ్డులో, 216 జాతీయ రహదారి సమీపంలో, సైఫన్ కాలువ సమీపంలో ఇసుక తరలించే లారీలు, రోడ్డు పక్కన తరలించేందుకు సిద్ధం చేసుకున్న ఇసుక డంపింగ్లు దర్శనమిస్తుంటాయి.
టైరుబండి రూ.2000..ట్రాక్టర్ రూ.3,500
గతంలో అర్ధరాత్రి టైరుబండితో ఇసుకను తరలించే అక్రమార్కులు నేడు రోజంతా టైరు బండ్లు, ట్రాక్టర్లతో ఇసుక సరఫరా చేస్తున్నారు. టైరు బండికి రూ.2 వేలు, ట్రాక్టర్ రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు వంద వరకు ట్రాక్టర్లు, టైరు బండ్లు, ట్రక్కుల ద్వారా ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. చీరాల మండలంలోని రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, పాతచీరాల, గవినివారిపాలెంతోపాటు వేటపాలెంలో ఆరితేరిన ముగ్గురు నాయకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. చీరాల పోలీసు రూరల్ సర్కిల్ పరిధిలోని రూరల్ పోలీస్స్టేషన్, వేటపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
రెచ్చిపోతున్న అక్రమార్కులు పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు
చర్యలు తప్పవు
ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించం. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నాం. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, పాతచీరాల, తీర ప్రాంత గ్రామాల్లో అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహించినా, అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
– కె.గోపికృష్ణ, తహసీల్దార్, చీరాల

చీరాలలో ఆగని ఇసుక దందా