
23న కలెక్టరేట్ వద్ద ధర్నా
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ
రేపల్లె: అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగి అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే.ఝాన్సీ తెలిపారు. గురువారం రేపల్లె సీడీపీవో సుచిత్రకు అంగన్వాడీల తరుపున ఆమె సమ్మె నోటీసు అందజేసి మాట్లాడారు. చాలీచాలని వేతనాలతో బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ పథకాల నుంచి దూరం చేయటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వాలు అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయన్నారు. కేవలం జీతభత్యాల చెల్లింపుల్లో కార్మికులుగా చూస్తూ అరకొర జీతాలతో సరిపెడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయని పక్షంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. 23న జరిగే ధర్నాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రేపల్లె ప్రాజెక్ట్ అధ్యక్షురాలు కే.రత్నకుమారి, నాయకులు ఎన్.కృష్ణకుమారి, పి.నిర్మల, బి.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
పీజీ లాసెట్లో చిరువ్యాపారి కుమార్తెకు స్టేట్ మొదటి ర్యాంకు
అద్దంకి: చిరు వ్యాపారి కుమార్తె ఏపీ పీజీ లాసెట్లో స్టేట్ మొదటి ర్యాంకు సాధించింది. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో నివాసం ఉంటున్న బైసాని శ్రీనివాసరావు చిరువ్యాపారి, ఆమె తల్లి సుజాత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. వీరి కుమార్తె హరితశ్రీ చిన్న వయసు నుంచి చదువులో ప్రతిభ చూపుతూ వస్తోంది. పదో తరగతి వరకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాన్లోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో చదివింది. తొలుత లా సెట్ రాసి ర్యాంకు సాఽధించి ఎల్ఎల్బీ చదివింది. అనంతరం పీజీ సెట్ రాసి ఏకంగా స్టేట్ మొదటి ర్యాంకు సాధించి అందరి మన్నన్నలు పొందింది. హరితశ్రీ మాట్లాడుతూ సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని తనకు పీజీ లా సెట్లో ర్యాంకు రావడానికి సహకారం అందించిన తన తల్లిదండ్రులతోపాటు, సిద్ధార్థ కళాశాల అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపింది.
చీరాల విద్యార్థికి 20వ ర్యాంకు
చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ పీజీ లాసెట్ ఫలితాల్లో చీరాల విద్యార్థి అన్నపురెడ్డి దేవి వరప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. బాపట్ల జిల్లా చీరాల రామకృష్ణాపురానికి చెందిన దేవి వరప్రసాద్ ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో తృతీయ సంవత్సరం ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. ప్రస్తుతం గురువారం ప్రభుత్వం విడుదల చేసిన లాసెట్ పోసు్ట్రగాడ్యూషన్ (పీజీ) పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. దేవి వరప్రసాద్ తల్లి చీరాల కోర్టులో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. తల్లిదండ్రులైన కల్పన, వెంకట శివ అందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్తులో తాను న్యాయమూర్తి కావాలనేది లక్ష్యమని తెలిపాడు. రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన దేవి వరప్రసాద్ను తల్లిదండ్రులతోపాటు సహచర మిత్రులు అభినందించారు.
నీటి కుంటలో పడి బాలుడి మృతి
యద్దనపూడి: ప్రమాదవశాత్తు బాలుడు(4) నీటికుంటలో పడి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పోలూరు ఎస్సీ కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన బాలుడు అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్నాడు. మధ్యాహ్నం కేంద్రానికి పక్కనే ఉన్న ఇంటికి వెళ్లాడు. ప్రతి రోజూ తమ బంధువుల ఇంటి వద్ద ఆడుకొని ఇంటికి వచ్చే బాబు సాయంత్రం 3 గంటలైనా ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోనే ఉన్న చెరువు వద్ద ఆర్వో ప్లాంటు కోసం తీసిన గోతిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ విషయమై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై రత్నకుమారి తెలిపారు.