వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరి

Jun 20 2025 5:45 AM | Updated on Jun 20 2025 5:45 AM

వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరి

వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరి

పర్చూరు(చినగంజాం): రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకే పంటలు సాగు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. పర్చూరులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. పర్చూరు వచ్చిన ఆయనకు స్థానిక రైతులు స్వాగతం పలికారు. పర్చూరు వై.జంక్షన్‌ నుంచి ట్రాక్టర్‌లతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బొమ్మల సెంటర్‌లోని ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు చేరుకొని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం పెట్టిన రూ.1650 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. ఈ ఏడాది మిర్చి, పొగాకు, కోకో, మామిడి పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆయన అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో రూ. 50, కిలోమామిడి రూ. 4 వంతున అదనంగా రైతులకు చెల్లిస్తుందని వివరించారు. నల్లబర్లీ హై గ్రేడ్‌ పొగాకు కిలో రూ.12, లో గ్రేడ్‌ పొగాకు రూ.6 చొప్పున రైతులకు చెల్లిస్తుందని తెలిపారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం సంతోషకరమైన విషయంఅన్నారు. ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న చివరి పొగాకు వరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. మార్క్‌ఫెడ్‌ సూచించిన నిబంధనల మేరకు నాణ్యమైన పొగాకుకు తీసుకొని వెళ్లి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంకట మురళి మాట్లాడుతూ గతంలో పొగాకు పంటకు లాభాలు వచ్చాయని, ప్రస్తుతం డిమాండ్‌ లేక గిట్టుబాటు ధర పడిపోయిందని వివరించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు ఎప్పుడు రావాలో ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని తెలిపారు. పొగాకు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తెలిపారు. వచ్చే ఏడాది రైతులు ఎవరూ పొగాకును పండించవద్దని సూచించారు. పొగాకు నారు, విత్తనాలు కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌, మార్కెఫెడ్‌ ఎండీ మంజీర్‌ జిలానీ సామూన్‌, గోడౌన్‌ ఎండీ సురేష్‌, ఏఎంసీ చైర్మన్‌ గుంజి వెంకటరావు, కార్యదర్శి తిరుపతి రాయుడు,బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.

ఆ ప్రకారమే రైతులు పంటలు వేసుకోవాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్చూరులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement