
యోగాతో ఆరోగ్యానికి రక్ష
కలెక్టర్ వెంకట మురళి
చీరాల టౌన్: ప్రతిరోజూ యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. గురువారం మండలంలోని వాడరేవులోని నగరవనంలో (సిటీ ఫారెస్ట్) యోగా అవగాహన క్యాక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న ప్రపంచమంతా జరుపుకుంటుందన్నారు. బాపట్ల జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 21న ఏపీలోని అన్ని జిల్లాలు, మండలాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వికసిత్ భారత్ వైపు దేశం, ఆంధ్రప్రదేశ్ పయనిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ యోగా చేయడం వలన చాలా మంచి ఫలితాలు ఉన్నాయని, యోగాను ప్రజలందరికీ అలవాటు చేసేందుకు సీఎం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగి ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. డీఆర్వో గంగాధర్గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీఎం అండ్ హెచ్వో విజయమ్మ, ఆయుష్ డాక్టర్ శ్రీనివాసరావు, పలుశాఖల అధికారులు, సిబ్బంది, పలువురు వైద్యులు, ఎస్సీపీ క్యాడెట్లు, ప్రజలు పాల్గొన్నారు.