ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన

May 28 2025 11:43 AM | Updated on May 28 2025 11:43 AM

ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన

ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉపాధ్యాయులు హాజరు

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు జోన్‌–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్‌–2 హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్‌ హెచ్‌ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్‌, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్‌, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు.

అర్హత లేని వారికి ప్రాధాన్యం

గ్రేడ్‌–2 హెచ్‌ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్‌, రోస్టర్‌ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జెడ్పీ, మున్సిపల్‌ హెచ్‌ఎం పోస్టులకు...

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్‌ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్‌ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్‌లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్‌ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్‌–8, కార్పొరేషన్‌–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులకు హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్‌ హెచ్‌ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement