
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తీరు
ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలు..
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఎన్నికల ముందు నిరుద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అధికారం చేపట్టాక వారితో కన్నీరు పెట్టిస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటికి పీకేసి ఉపాధిని దెబ్బతీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కావస్తోంది. నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన బాటలో నిరుద్యోగులు
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగుస్తున్నా మాట నిలబెట్టుకోకపోవడంతో మోసపోయిన యువత ఆందోళన బాట పడుతోంది. మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు పలుమార్లు ఆందోళనకు దిగారు. చిరకు అరకొర పోస్టులతో ప్రకటన చేసింది. వలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతోపాటు కోర్టులను ఆశ్రయించారు.
ఊసేలేని భృతి
ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేలు భృతి ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు గద్దెనెక్కి ఏడాదైనా దాని ఊసే ఎత్తడంలేదు. ఇంటికొకరికి నిరుద్యోగ భృతి అనుకుంటే నెలకు రూ.149.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి వుంది. కానీ పైసా ఇవ్వలేదు. 2014లోనూ చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఎగనామం పెట్టారు.
ఇంటికొక నిరుద్యోగి
జిల్లాలో జిల్లాలో 459 గ్రామపంచాయతీల పరిధిలో 944 గ్రామాలు ఉండగా వాటి పరిధిలో 4,97,000 గృహాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇంటికొకరు అనుకున్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఉద్యోగాలకోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఇలా....
వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసి 5,247 ఉద్యోగాలు కల్పించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో వేలాది మందికి వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. 348 హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి 348 ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి వారి శ్రమను గుర్తించింది. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారా జిల్లాలో 705 యూనిట్లు ఏర్పాటు చేసి వారికి రూ.110.69 కోట్ల మేర రాయితీలు కల్పించింది.
‘‘అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం... ఉద్యోగావకాశాలు రానివారికి నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాం...వలంటీర్లకు నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తాం...ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం...కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం’’ అంటూ చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ఊదరగొట్టారు.
నిరుద్యోగ భృతికి ఎగనామం ఎన్నికలప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు గద్దెనెక్కాక ఒక్క ఉద్యోగం కల్పించని వైనం డీఎస్సీ పేరుతో దగా ఇంటికొకరు అనుకున్నా జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళనలో యువత వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూటమి పాలన తీరుపై యువత ఆగ్రహం
ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి పభుత్వం చదువుకున్న యువతకు తక్షణం ఉద్యోగాలు కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలిస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. మాటలు చెప్పి ఓట్లేయించుకున్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవాలి. జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి.
– మాచవరపు రవికుమార్, రాష్ట్రకార్యదర్శి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తీరు

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తీరు