
తోడికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం
తెనాలిరూరల్: అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోడికోడళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలముకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే తోడికోడళ్ల బంధం మరణంలోనూ వీడలేదు. పట్టణానికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిలు తోడికోడళ్లు. ఝాన్సీరాణి కుమారుడు నాగార్జున, ఆడపడుచు పార్వతితో కలిసి వీరు ముగ్గురు గురువారం అరుణాచలానికి కారులో పయనమయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని ఒంగోలు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యకుమారి, సరస్వతికుమారి కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యకుమారి తన భర్త నరసింహారావుతో కలిసి ఇక్కడి కవిరాజపార్కు రోడ్డులో అక్షర గీత విద్యానికేతన్ను స్థాపించారు. సరస్వతికుమారి భర్త వెంకటేశ్వరరావు ఆర్మీలో పనిచేసి రిటైరై తెనాలిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఝాన్సీరాణి భర్త నాగేశ్వరరావు గాంధీచౌక్లో పారగాన్ వాచ్ కంపెనీ నిర్వహించేవారు. ముగ్గురు అన్నదమ్ములు గతంలోనే మృతి చెందారు. ఆప్యాయంగా ఉండే తోడి కోడళ్లు అరుణాచలం దర్శనం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆడపడుచు పార్వతిని వెంటబెట్టుకుని ఝాన్సీరాణి కుమారుడు నాగార్జునతో కలిసి తమకు తెలిసిన వారి కారు తీసుకుని బయలుదేరారు. రోడ్డుప్రమాదం రూపంలో వీరి కుటుంబాలను మృత్యువు కబళించింది. సూర్యకుమారికి ఇద్దరు కుమారులు ఉండగా. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. సరస్వతికుమారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవిరాజపార్కు రోడ్డు లో నివసిస్తున్నారు. ఝాన్సీరాణి పెద్దకుమారుడు గతంలో మృతి చెందగా, ప్రస్తుతం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద సాయి పథం అపార్ట్మెంట్లో చిన్న కుమారుడు నాగార్జున కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. ముగ్గురు తోడి కోడళ్లు మృతి చెందారన్న వార్త తెలియడంతో తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి.
బాపట్ల జిల్లాలో కారు ప్రమాదం ముగ్గురు మృత్యువాత