చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు

May 28 2025 11:43 AM | Updated on May 28 2025 11:43 AM

చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు

చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు

తెనాలి: నిందితుల అరెస్టు విషయంలో తెనాలి పోలీసులు చట్టవిరుద్ధంగా, అమానుషంగా వ్యవహరించారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో నడిరోడ్డుపై లాఠీలతో జులుం ప్రదర్శించటాన్ని ఖండించారు. బాధిత కుటుంబాన్ని ఈ మేరకు మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ పరామర్శించింది. అయితానగర్‌కు చెందిన నిందితుల్లో ఒకరైన దోమ రాకేష్‌ నివాసానికి వెళ్లి, ఆయన తండ్రిని కలిసింది. కుటుంబ నేపథ్యాన్ని, ఘటన వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నేతాజీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలిలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. గత నెల 24వ తేదీన రాత్రి వేళలో కానిస్టేబుల్‌ కన్నా చిరంజీవిపై నిందితులు దాడి చేశారని, ఆ క్రమంలో దాడికి గురైన కానిస్టేబుల్‌ను వెంటపెట్టుకొని పోలీసులు 25న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 27న మధ్యాహ్నం వరకు పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితులను చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబికులు చెప్పారని తెలిపారు. దానికి తోడు బహిరంగంగా నిందితులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన వీడియో వారి నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందన్నారు. దళితులు, మైనారిటీలు అనే కోణంలోనే పోలీసులు దాడి చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై విచక్షణారహితంగా దాడి చేయాలని ఏ చట్టంలోనూ చెప్పలేదన్నారు. అయినా పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంలో పోలీస్‌ వ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. కానిస్టేబుల్‌పై యువకులు దాడికి పాల్పడిన ఘటన వెనుకనున్న ఆంతర్యాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులు వెలికితీయాలన్నారు. కానిస్టేబుల్‌ కన్నా చిరంజీవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు అభియోగాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భావన్నారాయణ, తెనాలి ఏరియా కార్యదర్శి కె. బాబుప్రసాద్‌, ములకా శివసాంబిరెడ్డి పాల్గొన్నారు.

నిందితులను చిత్రహింసలకు గురిచేశారు కానిస్టేబుల్‌ చిరంజీవిపైనా పలు అభియోగాలు సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపణ బాధిత కుటుంబానికి సీపీఎం బృందం పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement