
స్టువర్టుపురం.. శోకసంద్రం
బాపట్లటౌన్: ఘోర రోడ్డు ప్రమాదంలో బాపట్ల మండలం, స్టువర్టుపురం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతిచెందిన ఘటన తెలిసిందే. ఆరుగురు మృతదేహాలు ప్రకాశం జిల్లా, గిద్దలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం శనివారం మధ్యాహ్నం స్వగ్రామమైన స్టువర్టుపురం గ్రామానికి తరలించారు. ఆరుగురు మృతదేహాలు గ్రామానికి తరలిరావడంతో శనివారం గ్రామంలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహాల వద్దకు చేరుకొని విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
మిన్నంటిన రోదనలు
‘నేడో, రేపో పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలో మీరు శవాలై కనిపిస్తారని మేము కలలో కూడా ఊహించలేదయ్యా’... ‘మీపైనే ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం...ఇంకా మాకు దిక్కెవరూ’... ‘మాకు తలకొరివి పెట్టాల్సింది పోయి...మీకే మేము పెట్టాల్సి వస్తోంది...మేమేమి పాపం చేశాము దేవుడా’ అంటూ గజ్జల జనార్ధన్, బొచ్చు సన్నీ, కర్రెద్దుల దివాకర్ల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ‘సాయంత్రానికి తిరిగొస్తామని చెప్పి శవాలై వచ్చారా’ అంటూ గజ్జల అంకాలు కుటుంబ సభ్యులు, ‘మా అమ్మ నా కళ్లముందే చనిపోయిందంటూ’ మొగిలి భవానీ కుమార్తె, కొడుకు సిరి, సిద్దూ చెబుతున్న మాటలకు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు గుండెలు పగిలేలా రోధించారు. లేకలేక పుట్టిన ఒక్కగానోక్క బిడ్డను, నన్ను ఒంటరిని చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయావా దేవుడా అంటూ గజ్జల నరసింహ భార్య జాబిల్లి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది.
అశ్రునయనాలతో అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన స్టువర్టుపురం గ్రామం, న్యూ గ్యాంగ్కు చెందిన గజ్జల నరసింహ (23), గజ్జల అంకాలు (45), పెద్ద గ్యాంగ్కు చెందిన గజ్జల జోసఫ్ అలియాస్ బబ్బులు (25), కర్రెద్దు దివాకర్(24), 6వ గ్యాంగ్కు చెందిన బొచ్చు సన్నీ(27), 1వ గ్యాంగ్కు చెందిన మొగిలి చిన్న భవానీ (23)ల అంత్యక్రియలు శనివారం సాయంత్రం స్టువార్టుపురం–ఈపూరుపాలెం మధ్యలోని ఆటోనగర్ శ్మశానవాటికలో నిర్వహించారు. మృతదేహాలు స్వగ్రామమైన స్టువర్టుపురం చేరుకోవడంతో బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు మృతుల గృహాలకు చేరుకొని మృతదేహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. మృతిచెందిన ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించి, నిరుపేదలైన కుటుంబసభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ఆటోనగర్లోని శ్మశానవాటికకు చేరుకొని మృతదేహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులకు ప్రభుత్వం తరఫున అందించాల్సిన అన్నిరకాల సహాయసహకారాలు అందించేలా కృషిచేస్తామన్నారు.
ముగిసిన పోస్టుమార్టం
కొమరోలు: మండలంలోని తాటిచెర్లమోటు సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందగా మృతదేహాలను పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మృతుల బంధువులు స్టూవర్టుపురం నుంచి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం వైద్యులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం ఆరు మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
చిన్నారులకు మెరుగైన వైద్యం
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారితో పాటు జీతన్, శిరీషలు ఆ కారులోనే ప్రయాణిస్తున్నారు. గాయపడిన వీరికి గిద్దలూరు వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు స్థానిక ఎస్ఐ నాగరాజు తెలిపారు.
స్వగ్రామానికి చేరుకున్న ఆరుగురి మృతదేహాలు ఆటోనగర్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం
వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు
కొమరోలు: తాటిచెర్లమోటు కారు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని మార్కాపురం డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఆర్టీఓ అల్లం మాధవరావుతో కలిసి శనివారం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120 కిలోమీటర్లు ఉందని స్పష్టం చేశారు. కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. వాహనాలను నిర్లక్ష్యంగా, వేగంగా ఎవరూ నడపొద్దని సూచించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ మల్లికార్జునరెడ్డి, ఆర్అండ్బీ డీఈ ఎం.నరసింహులు, గిద్దలూరు, కంభం సీఐలు రామకోటయ్య, మల్లికార్జున, ఎస్ఐలు రవీంద్రరెడ్డి, నాగరాజు, కోటేశ్వరరావు, సుదర్శన్ పాల్గొన్నారు.

స్టువర్టుపురం.. శోకసంద్రం

స్టువర్టుపురం.. శోకసంద్రం