మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటి సమగ్ర నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటి ప్రత్యేకాధికారి శివ్ నారాయణ శర్మ అన్నారు. మంగళవారం ఆయన చాంబర్లో ఎస్ఓగా బాధ్యతలను స్వీకరించారు. కమిషనర్ కే.ప్రమీల, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కమిషనర్తో చర్చించారు. అభివృద్ధి పనులు, సమస్యలు, పట్టణ వివరాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. పట్టణ పరిస్థితులు, తాగునీటి, నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణపై సమీక్షించారు.
లక్కిరెడ్డిపల్లి: అనంతపురం గంగమ్మ దేవత అమ్మవారి హుండీ ఆదాయం లెక్కించగా రూ. 11,45,267లు వచ్చినట్లు ఈఓ గ్రేడ్ వన్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏసీ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 17, 18,19వ తేదిలలో జరిగిన గంగమ్మ జాతర అనంతరం నాలుగు ఆదివారాలకు సంబంధించిన హుండీని లెక్కించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలి పారు. నగదుతోపాటు ఏడు గ్రాములు బంగా రం, 94 గ్రాములు వెండి వచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అట్లూరు: ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అంతరాయం లేని విద్యుత్ను సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రమణ తెలిపారు. మంగళవారం కరెంటోళ్ల జన బాట కార్యక్రమంలో భాగంగా అట్లూరు, బద్వేలు మండలం చింతపుత్తయ్యపల్లి గ్రామాలను ఎస్ఈ సందర్శించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. అట్లూరులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు విద్యుత్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా సూచనలు, ప్రమాదాల నివారణ చర్యలను వివరించారు. లైన్లు, ట్రాన్సఫార్మర్లు, కనెక్షన్లు, లోడ్ పరిస్థితులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు మరమ్మతులు చేపట్టాలని సిబ్బందికి ఎస్ఈ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ కుల్లాయప్ప, ఏఈలు షర్మిల, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ఖాజీపేట: ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని వైఎస్సార్ కడప జిల్లా సోషల్ వెల్ఫ్ర్ డీడీ సరస్వతి అన్నారు. ఖాజీపేట లోని ఇంటిగ్రేడ్ హాస్టల్ను ఆమె తనిఖీ చేశారు. హాస్టల్ గదులతో పాటు మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉన్న హాస్టల్ వార్డన్ పనితీరు సక్రమంగా లేని కారణంగా సస్పెండ్ చేశామన్నారు. ఇన్చార్జ్ వార్డన్తో పనిచేయిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా మెను ప్రకారం భోజనం అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థుల భోజన విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేంది లేదని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కడప రూరల్: క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దామని వైఎస్సార్ కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. అంతర్జాతీయ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.


