విద్యుత్ శాఖ ఏడీ సురేంద్రనాయక్, మండల ఏఈ శంకర్ రెడ్డి, విజిలెన్స్ పీసీ దిలీప్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఊరి వారిని విచారించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ స్తంభానికి ఉండాల్సిన వీధిలైటును రేకులతో కట్టిన వీరి ఇంటి బయట ఒక ఇనుప రాడ్కు అమర్చడం వల్ల విద్యుదాఘాతం జరిగిందన్నారు. దాని వైరు మిల్ట్ అయి ఉండడం గుర్తించామన్నారు. విద్యుత్ సరఫరా రేకుల ఇంటిలోని ఊయలకు వ్యాపించి ఇద్దరి మృతికి కారణమైనట్లు గుర్తించామన్నారు. ఊయల ఊగుతున్న బాలిక మధు ప్రియ కాళ్లు నేలను తాకకపోవడంతో అదృష్ట వశాత్తు విద్యుత్ షాక్ నుంచి బయటిపడినట్లు తెలిపారు. ఊరిలో అందరి ఇళ్లను తనిఖీ చేశామన్నారు. వీరి ఇంటికి తప్ప ఎక్కడా సమస్య లేదన్నారు.
వీధి లైట్ను రేకుల ఇంటి బయట అమర్చిన దృశ్యం
పద్మావతమ్మ (ఫైల్) రాపూర్ వెంకటేష్ (ఫైల్)
స్వల్ప గాయాలతో బయటపడిన మధుప్రియ, లిఖిత
ప్రమాదానికి కారణమైన ఊయల
కురబలకోట: ఊయలలో నవ్వులు..క్షణాల్లో కన్నీళ్లుగా మారాయి. ఆనందంగా ఊయల ఊగుతున్న చిన్నారులను కాపాడే ప్రయత్నంలో విద్యుత్ షాక్ రూపంలో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు జాతర సందడిలో మునిగి తేలిన ఆకుటుంబం క్షణాల్లో విషాదంలో మునిగిపోయింది. చూపరుల హృదయాలను కలచి వేసింది. కురబలకోట మండలం ముదివేడు గ్రామం రెడ్డివారిపల్లిలో ఈ విషాదకర సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ రూపంలో ఆ ఇంటిపై మృత్యువు మాటు వేసినా అదృష్టవశాత్తు ఇద్దరు బాలికలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంటిలోని మిగిలిన వారికి ఇరుగుపొరుగు వారికి గుండె ఆగినంత పనైంది. ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు, గ్రామస్థుల కథనం మేరకు...నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డి ఆదివారం ముదివేడులో జరిగే దండు మారెమ్మ జాతరకు సమీపంలోని రెడ్డివారిపల్లికి చెందిన బంధువు జగదీశ్వర్ రెడ్డి ఇంటికి భార్యా పిల్లలు, అత్త పద్మావతమ్మ ఇంకో మిత్రుడు రాపూర్ వెంకటేష్తో కలసి వచ్చారు. వీరంతా రెడ్డివారిపల్లిలో ఇంటి వద్ద ఉండగా శివకుమార్ రెడ్డి కుమార్తెలు మధుప్రియ (11), లిఖిత (9) ఇంట్లో ఉన్న ఊయల ఊగసాగారు. అది రేకుల ఇళ్లు. ఉన్నట్టుండి మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ షాక్ తగిలింది. బాలిక ఒక్కసారిగా అరిచింది. అక్కడే ఉన్న పద్మావతమ్మ (58) ఏమో జరిగిందన్న ఆత్రుతలో పాపను కాపాడాలి..అని ఊయల నుంచి కిందకు దింపబోయింది. ఊయల తగిలి విద్యుత్ షాక్తో ఆమె చనిపోయింది. అక్కడే ఉన్న వెంకటేష్ (38) కూడా చిన్నారికి ఏదో అయ్యిందని కాపాడాలని అతను కూడా ఊయలను పట్టుకున్నారు. అతను కూడా విద్యుత్షాక్కు గురై చనిపోయాడు. బాలిక మధు ప్రియ అప్పటికే ఊయల నుంచి కిందకు పడిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఈమెకు దగ్గరగా ఉన్న సోదరి లిఖిత (9) కూడా అదృష్టవశాత్తు బయటపడింది. హుటాహుటిన గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అంతకు ముందు అంతా జాతర హడావుడిలో ఆనందంగా కాలం గడుపుతుండగా ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలుముకుంది. మనవరాలిని కాపాడబోయి అవ్వ పద్మావతమ్మ, వారింటికి వచ్చిన వెంకటేష్ ఒకరి తర్వాత ఒకరు క్షణాల వ్యవధిలోనే చనిపోయారు. అంతా కోలుకోలేని షాక్కు గురయ్యారు. మృతి చెందిన ఎస్.పద్మావతమ్మది పుంగనూరు దగ్గర గోళ్లపల్లి కాగా రాపూర్ వెంకటేష్ది చిత్తూరు దగ్గర కొంగారెడ్డిపల్లి. ఇతను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మధు ప్రియకు స్వల్ప గాయాలు కావడంతో ఆసపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు.
తోడుగా వచ్చి..
విద్యుత్ షాక్తో మృతి చెందిన రాపూర్ వెంకటేష్ బెంగళూరులో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న శివకుమార్రెడ్డితో పరిచయం పెరగడంతో ఇద్దరు మిత్రులయ్యారు. ఇండ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. దీంతో జాతర చూద్దామని ఇద్దరూ ముదివేడు దగ్గర రెడ్డివారిపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ మధుప్రియ ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా రావడం, ఆమెను కాపాడబోయి రాపూర్ వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందడం తీరని వేదనగా మారింది. స్నేహితుడి కోసం జతగా వచ్చి మృత్యువాత పడటం విచారకరం. ఇక మాకెవరు దిక్కని ఇతని కుటుంబీకుల బోరున విలపించారు.
అల్లుడి ఇంటికి వచ్చి...
పద్మావతమ్మకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిని నిమ్మనపల్లి మండలం వలసపల్లికి చెందిన శివకుమార్ రెడ్డికి, మరో కుమార్తెను రెడ్డివారిపల్లిలోని జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఆమె రెడ్డివారిపల్లిలోని అల్లుడి ఇంటికి చాన్నాళ్ల తర్వాత జాతరకు వచ్చారు. చుట్టాలు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతుండగా మనవరాలు ఊగుతున్న ఊయలకు విద్యుత్ సరఫరా కావడంతో కాపాడబోయి విద్యుత్ షాక్ గురై పద్మావతమ్మ మృతి చెందడం తీరనిలోటుగా మారింది.


