సాక్షి రాయచోటి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. రైతులకై నా.. యువకులకై నా.. విద్యార్థులకై నా.. మహిళలకై నా.. అన్యాయం జరుగుతున్నట్లు తెలిస్తే చాలు.. వైఎస్సార్సీపీ ఉద్యమిస్తోంది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అందుకు అధికారంలో ఉన్న పార్టీ కొన్ని సంక్షేమాలను అమలు చేయకపోగా, ప్రభుత్వం చేపట్టే మరికొన్ని విధానాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలోనే కూటమి సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే నర్సిపట్నం మెడికల్ కళాశాలను పరిశీలించి ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. అంతకుమునుపే పార్టీ నేతల సమావేశంలో రచ్చబండతోపాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నాయి.
కదిలిన వైఎస్సార్సీపీ సైన్యం
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సైన్యం కదం తొక్కుతోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి ముమ్మరంగా సంతకాల సేకరణ కొనసాగిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలతోపాటు వివిధ పార్టీలు కూడా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యవహారాన్ని తప్పుబడుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతలతోపాటు నాయకులు, కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి సంతకాలు సేకరిస్తున్నారు.
ముమ్మరంగా సంతకాల సేకరణ
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు కె.సురేష్బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాయచోటి, పీలేరు, రైల్వేకోడూరులలో మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్లు పాల్గొంటున్నారు.
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై పోరుబాట
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తూ...సంతకాలు సేకరిస్తూ...
జిల్లా అంతటా ముమ్మరంగా కార్యక్రమ నిర్వహణ
అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు
కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
