
రహదారి కబ్జాకు కూటమి నాయకుల యత్నం
రాజంపేట రూరల్ : ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి నాయకుల అరాచకాలకు, కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యం. తాము చేసేది చట్టం.. చెప్పిందే న్యాయంగా కూటమి నాయకుల తీరు కొనసాగుతుంది. అందుకు ఉదాహరణగా మండల పరిధిలోని ఊటుకూరు పంచాయతీలో శుక్రవారం పట్ట పగలు రహదారిని కబ్జా చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించడాన్ని చెప్పుకోవచ్చు.
రహదారి కోసం పోరాటం..
ఊటుకూరు పంచాయతీలోని సర్వే నెంబరు 224, 225లలో గల 3 ఎకరాల పట్టా భూమిలోకి వెళ్లేందుకు రహదారి కోసం వైఎస్సార్సీపీ కార్యకర్త జగదాభి నాగేశ్వరరాజు కొన్ని సంవత్సరాలు పోరాటం చేశారు. చివరకు హై కోర్టు 2023లో నాగేశ్వరరాజుకు అనుకూలంగా రహదారి నిర్నాణం కోసం తీర్పునిచ్చింది. అదే విధంగా రెవిన్యూ, ఇరిగేషన్శాఖ అధికారులు పలు పర్యాయాలు వివాద స్థలంను సందర్శించి అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నాగేశ్వరరాజుకు రహదారిని నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అధికారులతో పాటు పోలీసుల సమక్షంలో 2023లో రహదారిని నిర్మించుకున్నారు.
కబ్జాకు యత్నం..
రహదారిని నిర్మించిన స్థలం 1947 సర్వే నెంబరులోని 43 సెంట్లు ఆర్ఎస్ఆర్ ప్రకారం గయ్యాళీ పొరంబోకుది. కూటమి ప్రభుత్వంకు చెందిన చేజర్ల వాసుదేవరాజు ఈ స్థలంను కబ్జా చేసుకునేందుకు దౌర్జన్యంకు యత్నించారు. శుక్రవారం ఉదయం పాత రహదారిపై జేసీబీని ఉంచి వాసుదేవరాజు అతని మనుషులు మాటు వేసి ఉన్నారు. పొలంలో ఉన్న నాగేశ్వరరాజు ఇంటికి వెళ్లగానే రహదారిని జేసీబీతో తొలగించాలనేది వారి పన్నాగం. అయితే పొలం నుంచి తమ ఇంటికి వెళతున్న నాగేశ్వరరాజు జేసీబీ ఆగి ఉండటం చూసి అనుమానం వచ్చి జేసీబీ డ్రైవర్ను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అనంతరం మాటు వేసిన వాసుదేవరాజు అతని మనుషలను చూపించాడు.
దౌర్జన్యం ఆపై దాడి..
విషయం బయట పడటంతో మాటు వేసిన వాసుదేవరాజు అతని మనుషులు దాదాపు 20 మంది జేసీబీ వద్దకు వచ్చి నాగేశ్వరరాజుతో వాగ్వివాదంకు దిగారు. నాగేశ్వరరాజు జేసీబీకి అడ్డు పడటంతో మూకుమ్మడిగా దౌర్జన్యంచేసి ఆపై విచక్షణా రహతంగా దాడి చేసి గాయ పరిచారు. సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి మందలించటంతో వాసుదేవరాజు వర్గం తగ్గింది. ప్రాణాపాయం తప్పి తీవ్ర గాయాల పాలైన నాగేశ్వరరాజును వారి కుటుంబ సభ్యులు పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నాగేశ్వరరాజును మన్నూరు సీఐ కుళాయప్ప తన సిబ్బందితో వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని ఫిర్యాదు స్వీకరించారు. తనకు వాసుదేవరాజు వలన ప్రాణహాని ఉందన్నారు.
వ్యవసాయమే ఆధారం..
నాకు ఉన్న 3 ఎకరాలే నాకు జీవనాధారం. నాకు ఉన్నది ముగ్గురు అమ్మాయిలే. నాకు ఎవరు లేరు. నాకు వ్యవసాయమే ఆధారం. నా పిల్లలను పోషించాలన్నా నేను జీవించాలన్నా ఆ పొలమే దిక్కు. ఆ భూమికి దారి లేకుంటే మా కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవాల్సిందే. దయతో ఉన్నత అధికారులు స్పందించి తమ పొలంకు ఉన్న రహదారి కబ్జా కాకుండా కాపాడాలని నాగేశ్వరరాజు వేడుకుంటున్నాడు.

రహదారి కబ్జాకు కూటమి నాయకుల యత్నం