
కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవా
రాయచోటి జగదాంబసెంటర్ : కాల్మనీ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు కాల్ మనీ వేధింపుల బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో ఏకాంబరంరెడ్డి, ఖాదర్వల్లి, ఆనంద్, అనురాధ అనేవారు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి అప్పులు ఇచ్చి వారి చేత ఖాళీ చెక్కులు, బాండ్లు తీసుకుని అత్యధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా, తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాల్మనీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. అత్యధిక వడ్డీలు, వేధింపులు తట్టుకోలేక గౌరీ లాంటి వారు బహిరంగ ప్రకటన చేయగలిగారు కానీ, చాలా మంది బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ మోసపూరితంగా ఉండే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఖాళీ చెక్కులు, బాండ్లు ఇవ్వకూడదని సూచించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు ఫోన్చేసి కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాల్ మనీ బాధితులు గౌరీ, సుజాతలతో పాటు సీపీఎం నాయకులు రామాంజులు, రామచంద్ర, మాధవ తదితరులు పాల్గొన్నారు.