
రాజంపేటలో తెలుగు తమ్ముళ్ల గొడవ
రాజంపేట : రాజంపేట తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల గొడవ తారాస్థాయికి చేరింది. బుధవారం స్ధానిక రోడ్లు భవనాల అతిథి గృహం (అన్నమయ్య అతిథి గృహం)లో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు వర్గీయులు ఇన్చార్జి విషయంపై గొడవకు దిగారు. ఇన్చార్జి లేకుండానే సమావేశం ఏమిటి అని ప్రస్తావన తెరపైకి వచ్చింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన కొందరు, రాజు వర్గానికి చెందిన కొందరి మధ్య సవాళ్లు విసురుకున్నారు. పార్టీ సర్వనాశనమవుతోందని పరస్పరం దూషించుకున్నారు. వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. తోపులాట కొనసాగింది. ఇరువర్గాలను శాంతింప చేసే పనిలో కొందరు తమ్ముళ్లు మధ్యస్తం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సమావేశం రసభాసగా మారిపోయింది. టీడీపీ కార్యాలయంగా గుర్తింపు పొందిన ఆర్అండ్బీ అన్నమయ్య అతిథి గృహంలో ఇరువర్గాల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. పరిశీలకుడు శివ ఎదుట తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఇంతవరకు రాజంపేట ఇన్చార్జి ఎవరనేది అధిష్టానం తేల్చకపోవడంతో ఇరు వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన జువ్వాది అదృష్టదీపుడు సమావేశంలో బత్యాల చెంగల్రాయుడుకు మద్దతుగా నిలిచారు. అయితే ఇది జీర్ణించుకోలేని చమర్తి వర్గం వారు రగిలిపోయారు. టీడీపీ నాయకుడు ఆనంద్ మరికొంతమందితో వాదులాట తారా స్థాయికి చేరింది. ఇక చేసేదేమీలేక సమావేశాన్ని అర్థంతరంగా ముగించేశారు. కులాల వారీగా టీడీపీలో నేతలు విడిపోయారు.
పరస్పరం వాదోపవాదాలు
పరిశీలకుని ఎదుటే బాహాబాహీ
టీడీపీలో బయటపడిన వర్గ విభేదాలు