
నా ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలి
పులివెందుల టౌన్ : తన ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని బాధితురాలు శ్రీపతి రామమునెమ్మ కోరారు. బుధవారం పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థలం విషయంలో తనకు అన్యాయం చేసిన టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎస్పీ అశోక్కుమార్లకు విన్నవించానన్నారు. తన స్థలాన్ని పునరుద్ధరించి రక్షణ కల్పించాలన్నారు. అలాగే ప్రభుత్వ కాలువ ఆక్రమణలతో పాటు సంబంధిత మున్సిపల్, రిజిస్ట్రేషన్ అధికారులపై కూడా విచారణ జరపాలని కోరారు. తన ప్లాటు నెంబర్ 10ను మల్లెల రాజేశ్వరి నుంచి కొనుగోలు చేశానని, రెవెన్యూ ఖాతాలో తన పేరు కూడా నమోదైందన్నారు. అయితే టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి అసలైన అమ్మకందారుతో కలిసి అక్రమ లాభార్జన కోసం అదే లింక్ డాక్యుమెంట్ను ఉపయోగించి దొంగ రిజిష్టర్ చేయించుకున్నారన్నారు. అలాగే తన స్థలంతోపాటు పక్కన ఉన్న ప్రభుత్వ కాలువ భూమిని కూడా విజయ్కుమార్రెడ్డి ఆక్రమించాడని, మున్సిపల్ అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించారన్నారు. ఈనెల 23వ తేదీ సోమవారం రాత్రి విజయ్కుమార్రెడ్డి, లక్షుమయ్యలతోపాటు మరికొంతమంది రాత్రివేళ నిబంధనలకు విరుద్ధంగా తన స్థలంలోకి ప్రవేశించి సిమెంట్ నిల్వ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ధ్వంసం చేసి జేసీబీ ద్వారా స్థలాన్ని చదును చేశారన్నారు.