
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం చెంబకూరు –మదనపల్లె రోడ్డు మార్గంలోని బలిజపల్లె వద్ద గత శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని దిగువపల్లెకి చెందిన లక్ష్మీ నరసమ్మ(65) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కృష్ణమ్మ, శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కాగా వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం చైన్నె ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. బెంగళూరు రోడ్డు చిప్పిలి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి నైలాన్ తాడుతో ఉరి వేసుకోగా, దాదాపు రెండు రోజుల క్రితం సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
ఏడుగురు జూదరుల అరెస్టు
రాయచోటి : రాయచోటి మండలం, ఎండపల్లి పంచాయతీ, రామిరెడ్డిగారిపల్లి సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఎస్ఐ విష్ణువర్దన్ ఆధ్వర్యంలో ఏడుగురు జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4,400 నగదు స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి