హార్సిలీహిల్స్‌ పతంజలికేనా? | - | Sakshi
Sakshi News home page

హార్సిలీహిల్స్‌ పతంజలికేనా?

Jun 26 2025 6:55 AM | Updated on Jun 26 2025 6:55 AM

హార్సిలీహిల్స్‌ పతంజలికేనా?

హార్సిలీహిల్స్‌ పతంజలికేనా?

బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ టూరిజం యూనిట్‌ను కూటమి ప్రభుత్వం పతంజలి సంస్థకు కట్టబెట్టేస్తుందా అన్న అనుమానాలను నిజం చేస్తూ గురువారం పతంజలి సంస్థ రాందేవ్‌ బాబా స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. హార్సిలీహిల్స్‌ను ప్రైవేటు పరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ఏప్రిల్‌ 23 ‘స్టెర్లింగ్‌ పోయే..పతంజలి’ వచ్చే శీర్షికన సాక్షి ప్రచురించిన కథనం నిజమే అని స్పష్టం అవుతోంది. చైన్నెకి చెందిన స్టెర్లింగ్‌ కంపెనీకి పర్యాటకశాఖ యూనిట్‌ను కట్టబెట్టేందుకు ప్రయత్నించి, అందుకు ఆస్తులను పరిశీలించుకునేందుకు సంస్థ బృందానికి అధికారిక అతిథి మర్యాదలను కల్పించారు. తర్వాత వెలుగులోకి రాని కారణాలతో ఆ సంస్థ వెనక్కు వెళ్లింది. తర్వాత పతంజలి ప్రతినిధుల బృందం ఏప్రిల్‌ 14న హార్సిలీహిల్స్‌ వచ్చి ఇక్కడి పరిస్థితులు, అతిథి గృహాలు, రెస్టారెంట్‌, ఖాళీ స్థలాలను పరిశీలించి వెళ్లింది. ఈ బృందం రాందేవ్‌ బాబాకు ఇక్కడి పరిస్థితులు వివరించి ఉంటారని, దీనితో ఆయనే స్వయంగా ఇక్కడికి వస్తున్నట్టు అర్థమవుతోంది. అధికారికంగా బాబా పర్యటన షెడ్యూలులో గురువారం ఉదయం డెహ్రాడూన్‌ నుంచి విమానంలో తిరుపతికి చేరుకుని, అక్కడికి సమీపంలోని కొన్నిచోట్ల పరిశీలనలు జరిపాక మధ్యాహ్నం హార్సిలీహిల్స్‌ చేరుకుంటారు. ఇక్కడి పర్యాటకశాఖ యూనిట్‌ను పరిశీలిస్తారని, మధ్యాహ్నం టూరిజం రెస్టారెంట్‌లో భోజనం చేస్తారని షెడ్యూలులో పేర్కొన్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల మేరకు పతంజలి కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. కాగా స్టెర్లింగ్‌ సంస్థకు టూరిజంను ఇచ్చేసి ప్రైవేటు పరం చేస్తారన్న ఆందోళనతో ఉన్న ఉద్యోగులకు ఆ సంస్థ తప్పుకోవడంతో ఊరట చెందారు. తర్వాత పతంజలి ప్రతినిధులు పరిశీలించి వెళ్లినప్పటి నుంచి తీవ్ర ఆందోళనతో ఉన్నారు. 2000లో ఇక్కడ పర్యాటకశాఖ యూనిట్‌ ప్రారంభం నుంచి దీన్ని నమ్ముకుని పని చేస్తున్న సిబ్బంది, కార్మికులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. పతంజలికి అప్పగిస్తే తమ బతుకులు ఏం కావాలని మధనపడుతున్నారు. పాతికేళ్లుగా టూరిజంను నమ్ముకున్న సిబ్బంది ఇప్పుడు మరో ఉపాధి వెతుక్కునే పరిస్థితుల్లో లేరు. అందులోనూ 45 నుంచి 50 ఏళ్లు వయసు దాటిన సిబ్బంది ఉన్నారు. వీరు మళ్లీ కొత్తగా ఉద్యోగాల కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో లేరు. ఈ పరిస్థితుల్లో రాందేవ్‌బాబా రాక, అనంతర పరిణామాలపై ఏం జరుగుతుందో అన్న ఆందోళన సిబ్బందిలో వ్యక్తం అవుతోంది. ఆయన వచ్చి వెళ్లాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 14 టూరిజం యూనిట్‌ను

పరిశీలించిన బృందం

నేడు రాందేవ్‌ బాబా రాక

ఉద్యోగుల్లో ప్రైవేటుకు ఇచ్చేస్తారా

అన్న ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement