
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోలేరా?
మదనపల్లె రూరల్ : మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు.. అఘాయిత్యాలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని అఖిల భారత మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రశ్నించారు. బుధవారం ఆమె మదనపల్లెలో వడ్డీ రాక్షసుల ఆగడాల పై స్పందిస్తూ.. వేధింపులకు గురైన గౌరీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై ఆరా తీశారు. మరికొంతమంది బాధితులతో మాట్లాడిన అనంతరం గౌరీతో కలిసి స్థానిక ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక అవసరమున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు వారికి అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ, వారి వద్ద నుంచి అసలు కన్నా పదింతలు ఎక్కువగా వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. మదనపల్లెలో గౌరీ అనే మహిళకు స్థానికంగా ఉంటున్న మాజీ సైనికుడు ఏకాంబరరెడ్డి, ఆదివేని ఆనంద్, అతని భార్య మంజుల, బండి హరినాథ్, అతని భార్య అనురాధలు అప్పు ఇచ్చారన్నారు. వారి అప్పు తీర్చేసినా ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడం, డబ్బులు కట్టలేని పక్షంలో వ్యభిచారం చేసి చెల్లించమని బలవంత పెట్టడం, అంతు చూస్తామని బెదిరించడం విచారకరమన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతమిచ్చినట్లు అయిందన్నారు. ఈ సమావేశంలో బాధితురాలు గౌరి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు, జిల్లా ఇన్చార్జి సాయి లక్ష్మి, అన్నమయ్య జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, చిత్తూరు జిల్లా కన్వీనర్ భువనేశ్వరి, మదనపల్లె పట్టణ కమిటీ సభ్యులు రెడ్డి ప్రసన్న, షాహినా పాల్గొన్నారు.
అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా)
రాష్ట్ర కార్యదర్శి రమాదేవి