
ఇటుకల బట్టీకి చెరువు మట్టి
కలికిరి : చెరువుల్లో మట్టి తరలింపునకు ఇరిగేషన్ శాఖ అధికారులు అధికారికంగా అనుమతులిస్తున్నారు. సాధారణంగా రైతులు తమ పొలాలకు మట్టి అవసరమై ఇరిగేషన్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని తగిన భూమి ఆధారాలు, ఇరిగేషన్ శాఖకు నామమాత్రపు రుసుము చెల్లించాలి. దీంతో ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత చెరువు నుంచి పొలానికి అవసరమైన మట్టిని తరలించుకోవడానికి అనుమతులు జారీ చేయాలి. ఇలాగే మండలంలోని పల్లవోలు గ్రామంలో గడికి చెందిన కొందరు రైతులు తమ పొలాలకు మట్టి అవసరమని సంబంధిత రికార్డులతో సహా ఇరిగేషన్ శాఖ అధికారులకు గడి సమీపంలోని గుంతలవానిచెరువు నుంచి మట్టి తరలించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టని అధికారులు ఏకపక్షంగా ఒక రైతుకు మాత్రమే అనుమతి ఉత్తర్వులు జారీ చేసి, మిగిలిన రైతులను నిత్యం కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. రాజకీయ అండదండలుంటేనే మట్టి తరలింపునకు అనుమతులు ఇస్తామని స్వయంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతుండటంతో గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన వ్యక్తి మాత్రం పొలానికి కాకుండా ఇటుకల వ్యాపార నిమిత్తం బట్టీకి మట్టిని రాత్రి పగలు తేడా లేకుండా తరలించుకుంటున్నాడు. ఇదేమని అడిగిన రైతులపై తనకు అనుమతులున్నాయని చెబుతున్నాడు. దీనిపై ఇరిగేషన్ శాఖ మండల ఇన్చార్జి జేఈ గోపీక్రిష్ణను వివరణ కోరగా రైతుకు పొలానికి మట్టి తరలించడానికి అనుమతి ఇచ్చామని, ఇటుకల బట్టీకి మట్టి తరలిస్తుండటం తమ దృష్టికి రాలేదన్నారు. బట్టీకి తరలింపుపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు