
అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య
ఒంటిమిట్ట : మండల పరిధిలోని చేనువారిపల్లె గ్రామానికి చెందిన ధారా మునయ్య(48) అనే వ్యక్తి గత నెల 29వ తేదీన కనిపించకుండా పోయినట్లు కేసు నమోదు కాగా ఆదివారం హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఒంటిమిట్ట సీఐ బాబు వివరాల మేరకు.. గతనెల 29వ తేదీన మండల పరిధిలోని మలకాటిపల్లె గ్రామంలో చీరాల అచ్చమ్మ అనే మహిళ దహన సంస్కారాలకు ధారా మునయ్య బైక్లో వెళ్లి తిరిగి వస్తుండగా ఉదయం 11 గంటలకు మంటపంపల్లి వద్ద అదృశ్యమయ్యాడు. అతని ఫోన్ సిగ్నల్ అందక పోవడం.. ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చింతరాజుపల్లి –బోయపల్లి శివారులో చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దహనం చేసిన మృత దేహాన్ని పరిశీలించగా మొబైల్ ఫోన్, ఽఆధార్ కార్డు లభించడంతో అది ధారా మునయ్య మృతదేహంగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, కాల్చేసి ఉంటారనే కోణంలో రిమ్స్ నుంచి వైద్యు బృందాన్ని పిలిచి సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ బాబు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మునయ్య హత్యకు వివాహేతర సంబంధాలే కారణమని తెలుస్తోంది.